టెక్నాలజీని వాడిన పోలీసులు అడవిలో తప్పిపోయిన ఒక బాలికను తల్లిదండ్రుల వద్దకు చేర్చగలిగారు. ఆసక్తికరమైన ఈ సంఘటన నల్లమల అటవీ ప్రాంతంలో జరిగింది. నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండలం అప్పాయిపల్లి గ్రామానికి చెందిన బింకు రేణుక మేకల కాపరి అయిన మల్లయ్య కుమార్తె. ఎప్పటిలాగే తండ్రికి మధ్యాహ్నం భోజనం తీసుకుని వెళ్లింది. గురువారం మధ్యాహ్నం 12 గంటలకు అక్కడకు వెళ్లి మల్లయ్యకు క్యారేజి ఇచ్చి ఇంటికి తిరుగుముఖం పట్టింది. అయితే సగం దూరం వచ్చే సరికి దారితప్పి అడవి లోకి వెళ్లి పోయింది. సాయంత్రం అయినా రేణుక తిరిగి రాకపోవడతో లింగాల పోలీసులకు సమాచారం అందించారు. దాంతో రంగంలోకి దిగిన లింగాల పోలీసులు ముందుగా స్థానికంగా విచారణ జరిపారు. వారికి ఎలాంటి క్లూ లభించకపోవడంతో బాలిక అడవిలోకి వెళ్లిపోయి ఉంటుందని అంచనా వేసుకున్న వారికి బాలిక వద్ద సెల్ ఫోన్ ఉన్నట్లు తల్లితండ్రి చెప్పారు. దాంతో నాగర్ కర్నూల్ జిల్లా ఐటీ సెల్ సహాయం తో మధ్యరాత్రి 12 గంటల వరకు శ్రమించి అప్పాయిపల్లికి 15 కిలోమీటర్ల దూరలో వానగుట్ట ప్రాంతం లో పోలీసులు ఆ బాలికను గుర్తించారు. బాలిక వద్ద ఉన్న సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా అచ్చంపేట డిఎస్పీ నరసింహులు, సిఐ రామకృష్ణ ఆధ్వర్యం లో లింగాల ఎస్ఐ రమేష్ సిబ్బంది, ఫారెస్టు అధికారులు, గ్రామస్తులు అంతా కలిసి వెతికి పట్టుకోగలిగారు. గ్రామస్థుల సహాయం తో రేణుకను వారి కుటుంబ సభ్యులకు క్షేమంగా అప్పగించారు. బాలిక ఆచూకీ కనిపెట్టిన పోలీసులను, సహకరించిన ఐ.టీ సెల్ అధికారులను బాలిక కుటుంబ సభ్యులు గ్రామస్థులు, ప్రజా ప్రతినిధులు అభినందించారు.
previous post