ఈ నెల 4 వ తేదీన కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం ఇసన్నపల్లి గ్రామంలో దళిత మహిళను వివస్త్రను చేసి దాడికి పాల్పడిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ నెల 9 న రామారెడ్డి పోలీసులు కేసు నమోదు చేయడంతో పాటు దాడికి పాల్పడిన ఐదుగురిని అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు. తాజాగా ఈ కేసులో మరొక నలుగురిని అరెస్ట్ చేసినట్టు కామారెడ్డి డిఎస్పీ ప్రకాష్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కేసులో మాచారెడ్డి మండలం లక్ష్మీరావుల పల్లి గ్రామానికి చెందిన రేండ్ల రాజు, పుట్ట నర్సింలు, కాళ్ళ దేవయ్య, రేండ్ల రాజులను ఆదివారం అరెస్ట్ చేసి రిమాండుకు తరలించడం జరిగిందన్నారు. ఈ కేసు విచారణ ఇంకా కొనసాగుతుందని, కేసులో ఇంకా ప్రమేయమున్న విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు. ఇలాంటి ఘటనలకు ఎవరు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
సత్యం న్యూస్, కామారెడ్డి