తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలో బోగస్ ఓటరు కార్డులు తయారు చేయమని ఆదేశించిన వైసీపీ నాయకుల పేర్లు చెప్పి సస్పెండ్ అయిన అధికారులు అప్రూవర్లుగా మారాలని సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. బోగస్ ఓటరు కార్డుల తయారీకి ఒత్తిడి తీసుకొచ్చిన వైసీపీ నాయకుల, ఉన్నతాధికారుల పేర్లు బహిర్గతం చేసి మీ నిజాయితీని నిరూపించుకోండి అని ఆయన అన్నారు. 34 వేల బోగస్ EPIC(ఎలక్షన్ ఫోటో ఐడెంటిటీ)కార్డుల తయారీ సూత్రధారుడు ఎవరు? ఎక్కడ తయారు చేశారు? నిగ్గు తేల్చండి.
34 వేల బోగస్ కార్డులను తొలగించిన తర్వాతే ఎన్నికలు జరపాలి లేనిపక్షంలో హైకోర్టును ఆశ్రయిస్తానని జిల్లా అధికార యంత్రాంగానికి, కేంద్ర,రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు నవీన్ కుమార్ రెడ్డి హెచ్చరిక జారీ చేశారు. తిరుపతి ఆధ్యాత్మిక నగరంలో గత నాలుగు సంవత్సరాలుగా జరిగిన అన్ని ఎన్నికలను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బోగస్ ఓట్లతో గెలిచిన వారిని పది సంవత్సరాలపాటు ఏ ఎన్నికలలో పోటీ చేయకుండా కేంద్ర ఎన్నికల సంఘం అనర్హత వేటు వేయాలి.
రాజకీయ నాయకుల స్వార్థ ప్రయోజనాల కోసం తమ ఉద్యోగాలను తాకట్టుపెట్టే ఉన్నతాధికారులకు ప్రభుత్వ ఉద్యోగస్తులకు వరుసగా జరుగుతున్న సస్పెన్షన్ లతో కనువిప్పు కలిగి ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలన్నారు. తిరుపతి నియోజకవర్గానికి నాలుగు దిక్కులలో వున్న సరిహద్దులలోని అన్ని డివిజన్ లలో పరిసర నియోజకవర్గాల నుంచి అవినీతి అధికారుల సహకారంతో ఓటర్ల జాబితాలో చేర్చిన వారి పేర్లను వెంటనే తొలగించి మీ ఉద్యోగాలను కాపాడుకోవాలని అధికారులకు నవీన్ హెచ్చరిక చేశారు.