వరదముంపు నగదు సహాయం అందజేసిన గులాబీ నేతలు కాస్త ఇంత దండుకున్నారు. వారివారి అనుచర గణానికి, బంధుమిత్రులకు సహాయం అందజేసుకొని చేతులు దులుపుకున్నారు. తీరా ఈ విషయం ఇంతింతై వటుడింతైనట్లు తీవ్ర విమర్శపాలు కావడం, ఆయా చోట్ల నేతలను అడ్డుకోవడం, ఆందోళనలు తీవ్రతరం కావడంతో టీఆర్ఎస్ ప్రభుత్వం మేలుకొని దిద్దుబాటు చర్యలు చేపట్టింది.
ఏం లాభం లేదు.. ఇక్కడా మరో తప్పిదమే
దిద్దుబాటు చర్యల్లో భాగంగా మీసేవాల్లో ఫారం నింపిఇస్తే అందరికీ వరదముంపు సహాయం అందజేస్తామంది. దీంతో నగరవ్యాప్తంగా ఉన్న నిరుపేదలు మీసేవా సెంటర్లలో క్యూలు కట్టారు. ఈ నేపథ్యంలో పలు మీ సేవా సెంటర్ల వద్ద గలాట చోటు చేసుకుంటోంది. దీంతో ఆయా మీసేవా సెంటర్ల వద్ద పోలీసులను కూడా పెట్టారు. మరోవైపు మీసేవా నిర్వాహకులు ఇదే అదనుగా భావించి ఫారం నింపి ఆన్లైన్లో అప్లై చేసేందుకు ఒక్కొక్కరి వద్ద ఒక్కోలా వంద నుంచి వెయ్యి వరకూ తీసుకుంటున్నారనే ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. నగరంలో ఎక్కడ చూసినా ఫారాలు చేతబట్టుకొని తిరిగేవారే కనిపిస్తున్నారే తప్ప ఏ ఒక్కరూ తీరిగ్గా వెళుతున్నట్లు కనిపించడం లేదంటే అతిశయోక్తి కాదు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమంపై కూడా తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఎన్నికల కోడ్ రిలీజైంది. మరి ఇప్పుడు వరదముంపు సహాయం అందుతుందా? అందదా? అన్నది స్పష్టత లేదు. ఏం లాభం లేదు.. ఇక్కడ కూడా టీఆర్ఎస్ అధిష్టానం మరో తప్పిదాన్ని చేసినట్లు అవగతమవుతోంది.
డేటా ఇప్పటికే ఉన్నా ఎందుకు వాడుకోవడం లేదో?
ఇప్పటికే ఇంతకుముందు కరోనా వల్ల నష్టపోయిన వారి డేటా ప్రభుత్వం వద్ద పూర్తిగా ఉంది. అదేంత సురక్షితంగా ఉందనేది ప్రభుత్వానికే తెలియాలి. వరద ముంపు సంభవించిన ప్రాంతాల్లో ఇంతకుముందు కరోనా సమయంలో రేషన్ కార్డు ద్వారా బ్యాంకు అకౌంట్లలో డిపాజిట్ చేసినట్లుగా చేస్తే సరిపోయేది ఇంత గందరగోళం తలెత్తేది కాదు. మరి ప్రభుత్వం ఇప్పుడు తీసుకుంటున్న ఈ డేటాను ఏం చేస్తుందోననే అనుమానాలున్నాయి.
అంతా గందరగోళంగానే ప్రభుత్వ తీరు
ఎడమ చెవిని ఎడమ చేతితోనే పట్టుకుంటే దగ్గర అని.. కుడి చేత్తో ఎడమ చెవిని పట్టుకున్నట్లుగా ప్రభుత్వ తీరు ఉందని ఇప్పటికే ఫారాలకు డబ్బులు, జిరాక్స్లకు డబ్బులు, మీసేవా సెంటర్లలో ఉన్న డబ్బులు ఖర్చు చేసుకుంటున్న వరదముంపు బాధితులకు చివరాఖరుకు ఏం మిగులుతుందో అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నలాగే గోచరిస్తోంది. కాగా ప్రభుత్వం వ్యవహరిస్తున్న ఈ తీరు వల్ల ప్రజలు టీఆర్ఎస్పై తీవ్ర గుర్రుగానే విషయం ఏ మీసేవా సెంటర్కెళ్లిన అర్థమైపోతోంది. శాపనార్థాలు, బూతులు తప్ప మీసేవా సెంటర్ల వద్ద వేరే మాటలు వినబడడం లేదంటే నమ్మండి.
గులాబీ పార్టీ ఎన్నికలలో గట్టేక్కేనా
ఈ నేపథ్యంలో గ్రేటర్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. ఇదే అదనుగా ప్రభుత్వం వరదముంపు సహాయం అందిస్తుండడంతో ఇన్ని బాధలనెదుర్కొన్న జీహెచ్ఎంసీ ఓటరు ఏ మేరకు గులాబీ పార్టీకి మొగ్గు చూపుతాడో? ఎవ్వరూ స్పష్టతనివ్వని పరిస్థితి ఏర్పడింది. ఏది ఏమైనా టీఆర్ఎస్ పెద్దలే కాకుండా ఈ విషయంలో అధికారుల, గులాబీ నేతల భాగస్వామ్యం కూడా ఉండడం అత్యంత బాధాకరం. నిరుపేదలను ఇలా ఎండలో తిప్పించుకుంటూ జిరాక్స్లని, ఫారాలని, మీసేవాలని, నేతల వద్ద తీసుకోవాలని మాటిమాటికి వ్యవహరించడం పట్ల ప్రజల్లో మాత్రం గులాబీ పార్టీకి ఇంతకుముందు ఉన్న ఇమేజ్ బాగా పడిపోయిందనేది ఇట్టే అర్థమవుతోంది.
పడకంటి నాగరాజు (సత్యం న్యూస్)