అధికార వైసీపీలో మరింత మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు బావుటా ఎగురవేయనున్నారా? జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అది నిజమే అనిపిస్తున్నది. ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేలు, ఒక ఎంపి తిరుగుబాటు బావుటా ఎగురవేసిన విషయం తెలిసిందే. మొత్తం 42 మంది పని తీరు బాగాలేదని, వారికి వచ్చే ఎన్నికలలో టిక్కెట్లు ఇచ్చేది లేదని అధిష్టానవర్గం స్పష్టం చేసిన నాటి నుంచి కొందరు పని తీరు మెరుగు పరచుకోగా మరి కొందరు మాత్రం నిరాశతో తిరుగుబాటు బాటలో పయనిస్తున్నారు.
అలాంటి వారిలో మరొకరు పేరు స్పష్టంగా వినిపిస్తున్నది. ఇప్పటికే నెల్లూరు జిల్లా కు చెందిన ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి తిరుగుబాటు జెండా ఎగురవేయగా ఇప్పుడు అదే జిల్లా నుంచి మరో ఎమ్మెల్యే తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు చెబుతున్నారు. 2012 నిండి జగన్ కు అండగా నిలిచిన సీనియర్ నాయకుడు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి. 2019 తర్వాత తనకు ఖచ్చితంగా మంత్రి పదవి వస్తుంది అని ఆయన ఆశించారు.
మంత్రి పదవి అటుంచితే .. తనకు రావాల్సిన పెండింగ్ బిల్లులు కూడా రావట్లేదు అని ఆయన అనుచరుల దగ్గర వాపోతున్నట్లు చెబుతున్నారు. పార్టీలో కనీస గౌరవం లేదు అని ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు చెబుతున్నారు. దాంతో పార్టీ మారడం తప్ప తనకు వేరే మార్గం లేదని అనుచరులకు ప్రసన్నకుమార్ రెడ్డి స్పష్టం చేసినట్లు చెబుతున్నారు. వైసీపీని వీడితే ఆయన టీడీపీలో చేరతారా లేక బీజేపీలో చేరతారా అనే విషయం పై చర్చ జరుగుతున్నది.