ముత్తూట్ ఫైనాన్స్ 43 శాఖల నుంచి 166 మంది కార్మికులను తొలగించినందుకు కేరళ సిఐటియు మళ్లీ సమ్మె ప్రారంభించనుంది. ఈ ఏడాది ఆగస్టు 20 న ప్రారంభమైన సమ్మె 52 రోజులు కొనసాగింది. హైకోర్టు పరిశీలకుడి నేతృత్వంలో ఎర్నాకుళం గెస్ట్ హౌస్లో జరిగిన సమావేశంలో వేతనాల పెంపు డిమాండ్ను యాజమాన్యం అంగీకరించింది. దాంతో కార్మికులు సమ్మె విరమించారు.
అయితే ఆనాడు జరిగి ఒప్పందాలను యాజమాన్యం గౌరవించలేదు. దాంతో మళ్లీ సమ్మె నోటీసు ఇచ్చారు. కార్మిక చట్టాలను యాజమాన్యం ఉల్లంఘించిందని, ప్రభుత్వ అనుమతి లేకుండా కార్మికులను తొలగించారని సిఐటియు కేరళ రాష్ట్ర కార్యదర్శి ఎలమారామ్ కరీం ఆరోపించారు. జనవరి 2 నుంచి నిరవధిక సమ్మెకు దిగాలని సిఐటియు నిర్ణయించింది. ముథూట్ ఫైనాన్స్ కు చెందిన ఒక్క కార్యాలయం కూడా పనిచేయకుండా చేస్తామని ఆయన అన్నారు.