తెలంగాణ సచివాలయం మూతపడే పరిస్థితి తీసుకువచ్చిన సెక్షన్ ఆఫీసర్ పై ప్రభుత్వం చర్య తీసుకున్నదో లేదో అర్ధం కాని పరిస్థితుల్లో సచివాలయ ఉద్యోగులు మాత్రం భయం భయంగా బిక్కు బిక్కు మంటూ ఉన్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో సచివాలయం ఉద్యోగులలో దాదాపుగా సగానికి పైగా వర్క్ ఫ్రం హోం చేస్తున్నారు.
కేవలం 20 నుంచి 30 శాతం మంది మాత్రమే భౌతికంగా సచివాలయానికి వస్తున్నారు. ఈ పరిస్థితిలో పశు సంవర్ధక శాఖ కు చెందిన ఒక సెక్షన్ ఆఫీసర్ ఢిల్లీ వెళ్లాడు. అక్కడ పశ్చిమ నిజాముద్దీన్ లో మర్కజ్ మసీదులో జరిగిన తబ్లిగీ జమాత్ లో పాల్గొన్నాడు. తిరిగి వచ్చాడు. వెంటనే ఉద్యోగ బాధ్యతల్లోకి వచ్చేశాడు.
వాస్తవానికి ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఇలా చేయకూడదు. ప్రభుత్వ ఉద్యోగి అందునా సచివాలయం ఉద్యోగి నగరం దాటి బయటకు వెళితే ఆ విషయం స్పష్టంగా తన సెలవు చీటీలో చెప్పాలి. శెలవు పూర్తి అయిన తర్వాత విధుల్లో చేరుతున్నాను అని చెప్పి చేరాలి.
అయితే ఇలా చేయకుండా గప్ చుప్ గా ఆ సెక్షన్ ఆఫీసర్ వచ్చి విధుల్లో చేరిపోయాడు. ఆఫీసులో కలియదిరుగుతూ బూర్గుల రామకృష్ణారావు భవన్ మొత్తం తిరిగాడట అతను. చాలా మందికి అతను షేక్ హ్యాండ్ కూడా ఇచ్చాడు. చివరకు ఈ విషయం ఆ శాఖ కార్యదర్శికి తెలిసింది.
ఆమె ఏర్పాటు చేసిన సమావేశానికి కూడా ఈ సెక్షన్ ఆఫీసర్ హాజరయ్యాడట. దాంతో నిబంధనలు ఉల్లంఘించినందుకు అతడిని సస్పెండ్ చేయాలని సిఫార్సు చేసి ఆమెతో బాటు ఆ శాఖ సిబ్బంది మొత్తం క్వారంటైన్ కు తరలి వెళ్లారు. ఇప్పుడు సచివాలయం మొత్తం ఇంచు ఇంచూ క్లీన్ చేస్తున్నారు.
నిన్న నేడు అయితే సచివాలయానికి వచ్చే కొద్ది మంది కూడా రాలేదు. సంబంధిత అధికారిపై చర్య తీసుకోవాలని ఆ శాఖ కార్యదర్శి రాసిన లేఖ ఏమైందో తెలియదు. అతనికి కరోనా నెగెటీవ్ వచ్చిందని నేడు పుకార్లు లేపారు. అంటే చర్య ఉండదనా? నెగెటీవ్ రావడానికి చర్యలకు సంబంధం ఏమిటి? చర్యలు తీసుకోవాల్సింది క్రమశిక్షణ తిప్పినందుకు కానీ కరోనా వచ్చిందనో రాలేదనో కాదు కదా? ఈ ప్రశ్నలన్నీ వేసుకుని సచివాలయం ఉద్యోగులు సైలెంటుగా క్వారంటైన్ కు వెళ్లారు.