ఇంతకాలం ఏపి సిఎం పేషీలో అప్రతిహత అధికారం చెలాయించిన ఇద్దరు సీనియర్ రిటైర్డ్ అధికారులు ఇప్పుడు అవమానభారంతో తప్పుకోబోతున్నారని విశ్వసనీయంగా తెలిసింది. సీనియర్ ఐఏఎస్ అధికారులైన అజయ్ కల్లాం, డాక్టర్ పి వి రమేష్ ల అధికారాలకు ఇటీవల ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి కోత విధించిన విషయం తెలిసిందే.
వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే అజయ్ కల్లాం, డాక్టర్ పి వి రమేష్ లను తీసుకుని వారికి కీలక బాధ్యతలను అప్పగించారు. సాధారణ పరిపాలన శాఖ, హోం, రెవెన్యూ, ఫైనాన్స్, ముఖ్యమంత్రి కార్యాలయ బాధ్యతలను అజయ్ కల్లాం కు అప్పగించారు.
ఆ నాటి నుంచి ఆయన ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి తలలో నాలికలా మారారు. అదే విధంగా అత్యంత కీలకమైన వైద్యం, విద్య లను డాక్టర్ పి వి రమేష్ చూసేవారు. ఆయనకు కూడా ఆ రెండు బాధ్యతలను తీసేశారు. ఇప్పుడు వారిద్దరూ కేవలం ముఖ్యమంత్రి సలహాదారులుగా మాత్రమే మిగిలిపోయారు.
అంటే అధికారాలు ఏమాత్రం లేకుండా పోయాయి. కేవలం నామమాత్రపు సలహాదారులుగానే మిగిలిపోయినందున ఒక ముఖ్యమంత్రి పేషీలో వీరికి కార్యాలయం కూడా ఉండకపోవచ్చు. ఈ నేపథ్యంలో తీవ్ర మసస్తాపానికి గురి అయిన ఈ ఇద్దరూ తమ సలహాదారు పదవులకు రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారని తెలిసింది.
గతంలో సీనియర్ ఐ ఏ ఎస్ అధికారి ఎల్ వి సుబ్రహ్మణ్యం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉండగానే అత్యంత అవమానకర రీతిలో ఉద్వాసనకు గురి అయ్యారు. అప్పుడు ముఖ్యమంత్రి పేషీలో ఉన్న ఈ ఇద్దరు సీనియర్ ఐఏఎస్ అధికారులు అదేమని అగడలేదు సరికదా తమ కెందుకులే అని ఊరుకున్నారు. సరిగ్గా ఏడాది తిరిగే సరికి ఎల్ వి సుబ్రహ్మణ్యం ఉద్వాసనకు గురి అయిన రీతిలోనే ఈ సీనియర్ ఐఏఎస్ లు కూడా పదవి నుంచి బయటకు వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎంతో సన్నిహితంగా ఉన్న ముఖ్యమంత్రి తమకు బాధ్యతలు తొలగిస్తున్న విషయాన్ని తమతో నేరుగా చెప్పలేదని ఈ ఇద్దరు సీనియర్ అధికారులు తమ సన్నిహితులతో వాపోతున్నారని తెలిసింది. ఆదేశాలు వెలువడే వరకూ ఈ ఇద్దరికి తమ బాధ్యతలకు అంటకత్తెర పడుతున్న సంగతి తెలుసుకోలేకపోయారు. ఇప్పుడు ఇక ముఖ్యమంత్రి కార్యాలయంలో పని కూడా ఉండదు కాబట్టి వారు అవమానభారంతో తప్పుకోబోతున్నారని తెలిసింది.