సి పి ఎస్ ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేసి ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి పాదయాత్ర లో ఇచ్చిన హామీని నెరవేర్చాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం మంగళగిరి శాఖ అధ్యక్షులు ఎం మురళి కోరారు.
ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు మంగళగిరి ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యాన మంగళవారం మున్సిపల్ కమీషనర్ హేమమాలినీరెడ్డి కి వినతి పత్రం అందజేశారు.
అనంతరం ప్రదర్శనగా తహసీల్ధార్ కార్యాలయానికి వెళ్లి డిప్యూటీ తహసీల్ధార్ కు వినతి పత్రం సమర్పించారు. సెప్టెంబర్ ఒకటి 2004 తరువాత విధుల్లో చేరిన ప్రభుత్వ ఉద్యోగులకు సి పి ఎస్ ద్వారా పెన్షన్ వచ్చే విధానాన్ని రద్దు చేసి పాత విధానాన్ని అమలు చేస్తానని పాదయాత్రలో ఉండగా జగన్మోహనరెడ్డి హామీ ఇచ్చారని గుర్తు చేశారు.
పాత పెన్షన్ విధానం అమలు హామీని నెరవేర్చాలని వినతి పత్రం ద్వారా కోరారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఉద్యోగుల సంఘం మంగళగిరి శాఖ సెక్రెటరీ అరుణ్ కుమార్,ఉపాధ్యక్షులు మాధవరావు,ఎస్ కె నర్గీస్ బేగం,జాయింట్ సెక్రెటరీ కె యశోధరావు,మున్సిపల్ రెవెన్యూ ఆఫీసర్ బాబూరావు,మున్సిపల్,సి టి ఓ కార్యాలయాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.