మూడు రాజధానుల నిర్ణయం వల్ల అమరావతి నిర్మాణం ఆగిపోయిందని, జధాని లేని రాష్ట్రంగా ఏపీ ఉందని విజయవాడ ఎంపీ కేశినేని నాని పార్లమెంటులో ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంటులో రాష్ట్రపతికి ధన్య వాదాలు తెలిపే తీర్మానాన్ని కేశినేని నాని ప్రవేశపెట్టారు. అనంతరం ఏపీలోని పలు సమస్యలను లేవనెత్తారు. 2014-19లో భూసమీకరణతో రాజధాని అమరావతి అభివృద్ధికి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేశారని గుర్తుచేశారు.
జాతీయ ప్రాజెక్టు పోలవరం అసంపూర్తిగానే ఉందన్నారు. ఏపీ ఆర్థిక దుర్వినియోగం వల్ల సుమారు రూ.4 లక్షల కోట్లు అప్పుల పాలైందని వెల్లడించారు. రాష్ట్ర అభివృద్ధికి కేటాయించిన నిధుల్ని ఏపీ ప్రభుత్వం ఇతర ప్రయోజనాల కోసం మళ్లిస్తోందన్నారు. ఏపీలో రైతుల ఆత్మహత్యలు పెరిగాయని, దీనికి ప్రదాన కారణం అప్పులేనన్నారు.
నేరాల రేటు జాబితాలో టాప్ పదిలో ఏపీ ఉందన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయన్నారు. కేంద్ర ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని ఆయన కోరారు.