రైతు బీమాకు అర్హులైన రైతులు దరఖాస్తు చేసుకోవాలని వెంకటేశ్వర్లు సూచించారు. నాగర్ కర్నూల్ జిల్లాలో నూతనంగా అర్హులైన రైతులు రైతు బీమా కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి వెంకటేశ్వర్లు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూజులై 10న ఈ ప్రక్రియ ప్రారంభం కాగా ఆగస్టు 5 లోపు బీమా పథకంలో నమోదు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు.
నాగర్ కర్నూల్ జిల్లాలో కొత్తగా పాస్ బుక్ వచ్చిన రైతులు కూడా ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చునని ఈ పథకంలో నమోదైన రైతు ఏ కారణంతో మృతి చెందినా బాధిత కుటుంబానికి రూ.5 లక్షల బీమా సొమ్మును ప్రభుత్వం అందిస్తోందన్నారు. ఈ పథకానికి 18 వయస్సు నుండి 60 ఏళ్లలోపు వయసున్నవారు మాత్రమే పథకంలో నమోదుకు అర్హులుగా ఉంటారన్నారు.
అదేవిధంగా ప్రస్తుతం వయసు నిండినవారిని, చనిపోయినవారి పేర్లను పథకంలోనుంచి తొలగించి నూతనంగా పట్టాదారు పాసుపుస్తకాలు పొందినవారి పేర్లు నమోదు చేస్తామని తెలిపారు. ఇప్పటికే ఈ పథకంలో నమోదైనవారు నూతనంగా నమోదు చేసుకోవాల్సిన అవసరం లేదని జూన్ 18 వరకు పట్టాదారు పాసుపుస్తకాలు పొందినవారిని అర్హులుగా పరిగణిస్తారని ఏఈవోల వద్ద ఆయా గ్రామాల జాబితాలుంటాయని పేరు నమోదుచేసే రైతు స్థానికంగా ఉండాలన్నారు.
పట్టాదారు పాసుపుస్తకం, బ్యాంకు ఖాతా, రైతుతోపాటు నామినీ ఆధార్కార్డుల నకలు ప్రతులను, నామినీ నమోదు పత్రాన్ని పూరించి ఏఈవోలకు ఇవ్వాలని తెలిపారు. చట్టపరమైన వారసత్వం కలిగినవారు నామినీగా ఉండాలని, గతంలో పథకంలోని రైతుల పేరిట నమోదైన నామినీ చనిపోతే నామినీ పేరు మార్పునకు అవకాశం ఉంటుందని ఆయన సూచించారు. కాగా నాగర్ కర్నూల్ జిల్లాలో కొత్తగా అర్హులైన రైతులు 17482 మంది రైతులతో పాటు గతంలో పట్టాలు ఉండి నమోదు చేసుకొని 32825 మంది రైతులు కూడా రైతు బీమాకు దరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు.