ఓటరు జాబితా నుంచి తొలగించిన ఓటర్ల వివరాలను క్షేత్రస్థాయిలో పర్యటించి మరోసారి పరిశీలన చేసి ధృవీకరించాలని జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ అన్నారు. బుధవారం నాగర్ కర్నూల్ ఆర్డీవో కార్యాలయంలో నాగర్ కర్నూల్ నియోజకవర్గం తహసిల్దార్లతో ఓటర్ జాబితాలో పి.ఎస్.ఈ ఎంట్రీ ధృవీకరణ, ఓటర్ ఎపిక్ కార్డుల జారీ, నూతన ఓటర్ల నమోదు ట్రాన్స్ జెండర్ ఓటర్ల నమోదు తదితర అంశాలపై కలెక్టర్ ఉదయ్ కుమార్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫోటో సిమిలర్ ఎంట్రీ మొదటి దఫా క్రింద క్షేత్ర స్థాయిలో తొలగించిన ఓట్ల వివరాలు మరోసారి పరిశీలించాలని అధికారులకు సూచించారు. నాగర్ కర్నూల్ నియోజకవర్గం నుంచి ఇతర ప్రాంతాలకు తరలి వెళ్లిన, మరణించిన వారి పేర్లు, డూప్లికేట్ ఓట్లు జాబితా నుంచి తొలగించిన, తొలగించిన ఓట్లకు సంబంధించి సంపూర్ణ సమాచారం తమ వద్ద అందుబాటులో ఉండాలని, తొలగించిన ఓట్ల వివరాలు మరోసారి పరిశీలించి ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు అవసరమైన డాక్యుమెంట్లు ఉన్నాయో లేవో ధ్రువీకరించాలని కలెక్టర్ తాసిల్దార్లను ఆదేశించారు.
నాగర్ కర్నూల్ నియోజకవర్గ పరిధిలో 259 పోలింగ్ కేంద్రాలలోని 5101 గృహ సముదాయాలలో 6 ఓట్ల కన్నా ఎక్కువగా ఉన్న 4,4650 ఓట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని ఆదేశించారు. నియోజకవర్గంలో 2 లక్షల 13 వేల 183 మంది ఓటర్లు ఉన్నారని, అందులో 107058 మంది పురుష ఓటర్లు,106122 మంది మహిళా ఓటర్లు ఉండగా కేవలం ముగ్గురు మాత్రమే ట్రాన్స్ జెండర్లు ఓటు హక్కు కలిగి ఉన్నారని, నియోజకవర్గం లో చాలామంది ట్రాన్స్ జెండర్ లు ఉన్నారని సిడిపిఓల ద్వారా ట్రాన్స్ జెండర్ ల ఓట్ల నమోదుకు సిడిపిఓల సహకారం తీసుకొని ట్రాన్స్ జెండర్ ల ఓట్ల శాతాన్ని పెంచాలని ఆదేశించారు. ప్రతి సిడిపిఓ ట్రాన్స్ జెండర్ ల 10 ఓట్లు నమోదు చేసేలా టార్గెట్ ఇవ్వాలన్నారు.
తద్వారా ఎపిక్ కార్డు ద్వారా గుర్తింపు పొంది వారికి జీవనోపాధి అవకాశాలు మెరుగుపడుతుందనన్నారు. అలాగే నియోజకవర్గ పరిధిలో 18, 19 సంవత్సరాల వయసు గల యువ ఓటర్లు కేవలం 1676 మంది మాత్రమే కలిగి ఉన్నారని, ఒక శాతం కూడా లేరని, 18 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించేలా కృషి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా కళాశాలలను సందర్శించి, ఓటర్ల నమోదుకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. నాగర్ కర్నూల్ నియోజకవర్గ పరిధిలో ఒక మొబైల్ పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటుచేసి అందులో డెమో ఈవీఎంలను ఏర్పాటు చేసి గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ఓటర్లకు అవగాహన కార్యక్రమాలను నిర్వహించేలా ప్రచార కార్యక్రమాలను నిర్వహించాలని ఆర్డిఓను కలెక్టర్ ఆదేశించారు.
అందుకు మున్సిపల్ వాహనాలను వినియోగించుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. నాగర్ కర్నూలు నియోజకవర్గ పరిధిలో తొలగించిన 5374 ఓటర్లలో 336 మరణించిన ఓటర్లు కాగా, 40 ఇతర నియోజకవర్గానికి బదిలీ చేసుకున్న ఓటర్ల వివరాల జాబితాను మండలాల వారీగా కలెక్టర్ పరిశీలించారు. 100 సంవత్సరాలు దాటిన ఓటర్లను పరిశీలించాలన్నారు. నియోజకవర్గంలో 37 మంది వంద సంవత్సరాలు దాటిన వారు ఉన్నారన్నారు. పోలింగ్ కేంద్రాల్లోని మౌలిక సదుపాయాలపై క్షేత్రస్థాయిలో పర్యటించి అధికారులు వివరాలు నమోదు చేయాలని ఆదేశించారు. జూలై 24 నుంచి ఆగస్టు 31 వరకు సవరణలు పరిశీలన, ముసాయిదా జాబితా ప్రచురణ, సెప్టెంబర్ 2నుంచి 31 వరకు అభ్యంతరాల స్వీకరణ, పరిష్కారం,అక్టోబర్లో తుది ఓటర్ జాబితాను ఎన్నికల విడుదల చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. నియోజకవర్గంలో 18 సంవత్సరాల పైబడిన ఓటర్ల పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు. ఓటర్ల జాబితా పక్కాగా ఉండేలా అధికారులు చర్యలు చేపట్టాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో నాగర్ కర్నూల్ ఆర్డీవో నాగలక్ష్మి, నాగర్ కర్నూల్ తాడూర్ బిజినపల్లి తెలకపల్లి తిమ్మాజీపేట తాహసిల్దార్లు తదితరులు పాల్గొన్నారు.