ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ గా డాక్టర్ ఎన్. రమేష్కుమార్ ను తొలగించేందుకు జారీ చేసిన ఆర్డినెన్స్ చెల్లదని సీనియర్ న్యాయవాది జంధ్యాల రవి శంకర్ అన్నారు. హైకోర్టులో నేడు రమేష్ కుమార్ తొలగింపుపై పిటిషనర్ల తరపున వాదనలు పూర్తయ్యాయి. తదుపరి విచారణను హైకోర్టు గురువారానికి వాయిదా వేసింది.
ఏపీ మాజీ ఎస్ఈసీ తొలగింపుపై వాదనలు వినిపించేందుకు ప్రభుత్వానికి ఒకటిన్నర రోజు సమయాన్ని ధర్మాసనం ఇచ్చింది. ఆర్డినెన్స్ తీసుకురావడానికి గల కారణాలు ఏవీ స్పష్టంగా చెప్పనపుడు ఆర్డినెన్స్ చెల్లదని జంధ్యాల వాదించారు.
ఇది పూర్తిగా అధికార దుర్వినియోగానికి పాల్పడడమే అని సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం స్పష్టంగా చెప్పిందని జంధ్యాల అన్నారు. ఎన్నికల సంస్కరణల పేరుతో 77 ఏళ్ల వ్యక్తిని ఎన్నికల కమిషనర్ గా నియమిస్తే ఆయన ఎంత వరకు సమర్ధవంతంగా పనిచేయగలరని జంధ్యాల వాదించారు.
రమేష్ కుమార్ ను రాజ్యాంగంలోని 243K అధికారణ మేరకు నియమించారని, ప్రభుత్వం మాత్రం 200 ప్రకారం నియమించామని చెబుతుందని, 200 ప్రకారం చేయడానికి వీలేదని, ఎలక్షన్ కమిషనర్ నియామకాన్ని 243K ప్రకారమే చేపట్టాలని రాజ్యాంగంలో స్పష్టంగా ఉందన్నారు.
243K ప్రకారం సర్వీస్ నిబంధనలు ఉద్యోగంలో చేరినప్పటి నుంచి రిటైర్ అయ్యే వరకు వర్తిస్తాయని అన్నారు. ప్రభుత్వం పూర్తిగా రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించిందని, ప్రభుత్వ ఆర్డినెన్స్ వెనుక దురుద్దేశం ఉందని జంధ్యాల రవి శంకర్ వాదించారు.