జిల్లాలోని ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఈ నెల 15న, 2 సెషన్స్ లలో జరుగుతుందని అదనపు కలెక్టర్ డి. మధుసూదన్ నాయక్ అన్నారు. కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో టెట్ పరీక్ష నిర్వహణపై అదనపు కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, టెట్ పరీక్ష నిర్వహణకు జిల్లాలో అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఖమ్మం నగరంలో ఉదయం సెషన్ పరీక్ష 54 కేంద్రాల్లో, మధ్యాహ్నం సెషన్ పరీక్ష 45 కేంద్రాల్లో జరుగుతుందని ఆయన అన్నారు.
పరీక్ష నిర్వహణలో పాలుపంచుకునే రూట్ ఆఫీసర్స్ కు, చీఫ్ సూపరింటెండెంట్ లకు, డిపార్ట్మెంట్ అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించినట్లు ఆయన తెలిపారు. ఎన్నికలు, పరీక్షలు అతి జాగ్రత్తగా నిర్వహించవలసిన బాధ్యతలని, పరీక్ష నిర్వహణలో పాలుపంచుకునే ప్రతి ఒక్కరు అత్యంత శ్రద్ధతో పగడ్బందీగా పరీక్ష నిర్వహణ జరపాలని అదనపు కలెక్టర్ సూచించారు.
ఒక్క నిమిషం నిబంధన అమలులో ఉన్నదని, ఎవరైనా అభ్యర్థులు డౌన్లోడ్ చేసుకున్న హాల్ టికెట్ పై ఫోటో కానీ, సంతకం కానీ లేనట్లయితే గెజిటెడ్ అధికారి ధ్రువీకరణతో అనుమతించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి సోమశేఖరశర్మ, జిల్లా ప్రభుత్వ పరీక్షల విభాగపు అదనపు సంచాలకులు ధన, రిసోర్స్ పర్సన్స్ నారాయణ, రవికుమార్, తదితరులు పాల్గొన్నారు.