రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి హైదరాబాద్ నుండి టెలీ కాన్ఫరెన్స్ ద్వారా ఏప్రిల్ 14 న డా. బి.ఆర్. అంబేద్కర్ జయంతి రోజున జరగబోయే డా. బి.ఆర్. అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమ నిర్వహణ ఏర్పాట్లపై అన్ని జిల్లాల కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. ఖమ్మం జిల్లా నుండి జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్, అదనపు కలెక్టర్లు స్నేహలత మొగిలి, ఎన్. మధుసూదన్, నగర పాలక సంస్థ కమీషనర్ ఆదర్శ్ సురభి టెలీ కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లా నుండి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. జిల్లా నుండి 30 బస్సుల ద్వారా 1500 మంది ప్రతినిధులను తరలించడం జరుగుతుందని, ప్రత్యేక అధికారులను, జిల్లా అధికారులను నియమించి టిఫిన్స్, భోజన వసతి, త్రాగునీరు, తదితర సౌకర్యాలు అన్ని కల్పించామని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వ సూచనల మేరకు ప్రతినిధులను తరలించడం జరుగుతుందని అన్నారు.
ప్రతి బస్సుకు బ్యానర్, బస్సు ఇంచార్జి యొక్క మొబైల్ నెంబర్ ప్రదర్శించి, కార్యక్రమం ప్రారంభమై, పూర్తి అయ్యేంతవరకు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేస్తున్నట్లు, కలెక్టర్ తెలిపారు. ఈ టెలీ కాన్ఫరెన్స్ లో అసిస్టెంట్ శిక్షణ కలెక్టర్ రాధికా గుప్తా, జిల్లా పరిషత్ సిఇఓ వి.వి. అప్పారావు, టీఎస్ అర్టిసి ఆర్ఎం ప్రభులత, సోషల్ వెల్ఫేర్ డిడి కె. సత్యనారాయణ, జిల్లా రవాణా శాఖ అధికారి కిషన్ రావు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.