ధాన్యం, పత్తి కొనుగోలుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ ఆదేశించారు. కలెక్టరేట్ లోని ప్రజ్ఞ సమావేశ మందిరంలో అధికారులతో ధాన్యం, పత్తి కొనుగోలుకు ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దిగుబడి అంచనాల మేరకు కొనుగోలుకు కావాల్సిన ఏర్పాట్లు చేయాలని అన్నారు.
జిల్లాలో వానాకాలం-2022 లో 2 లక్షల 89 వేల 899 ఎకరాల్లో వరి పంట వేసినట్లు, ఇందులో 6 లక్షల 66 వేల 768 మెట్రిక్ టన్నుల పంట ఉత్పత్తి అంచనా ఉన్నట్లు ఆయన అన్నారు. అవసరమైన గన్ని బ్యాగులు, తేమ పరీక్ష, తూకం యంత్రాలు సిద్ధంగా ఉంచాలన్నారు. ప్రతి కేంద్రం వద్ద రవాణాకు వాహనాలు అందుబాటులో ఉంచాలన్నారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఎలాంటి సమస్యలు లేకుండా సేకరణ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. వానాకాలం 2022-23 కి గాను జిల్లాలో 2 లక్షల 21 వేల 743 ఎకరాల్లో పత్తి సాగు చేపట్టగా, ఒక లక్షా 66 వేల 307 మెట్రిక్ టన్నుల దిగుబడి అంచనా ఉందన్నారు.
13 కొనుగోలు కేంద్రాలు
జిల్లాలోని 13 జిన్నింగ్ మిల్లులు, రోజుకు 4380 బేళ్ళ సామర్ధ్యం కలవి ఉన్నాయన్నారు. గత సంవత్సరం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదని, ఈ సంవత్సరం 13 ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. జిన్నింగ్ మిల్లులతనిఖీలు చేసి, ఎలక్ట్రానిక్ తూకం యంత్రాలు, అగ్నిమాపక యంత్రాలు ఉన్నవి, పరిస్థితిపై నివేదిక సమర్పించాలన్నారు. సేకరణలో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు చేపట్టాలన్నారు.
ఈ సందర్భంగా పత్తికి కనీస మద్దతు ధర, వానాకాలం 2022-23 నాణ్యత ప్రమాణాలపై రూపొందించిన పోస్టర్ ను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ ఎన్. మధుసూదన్, జిల్లా పౌరసరఫరాల అధికారి రాజేందర్, జిల్లా వ్యవసాయ అధికారిణి విజయనిర్మల, జిల్లా రవాణాధికారి కిషన్ రావు,జిల్లా మార్కెటింగ్ అధికారి నాగరాజు, అదనపు డిసిపి ఏసి బోస్, ఎసిపిలు ఆంజనేయులు, ప్రసన్న కుమార్, ఏఎంసి కార్యదర్శులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.