వనపర్తి జిల్లా పాన్ గల్ మండలం మల్లాయిపల్లి గ్రామానికి చెందిన మైనర్ బాలిక పై అత్యాచారం చేసిన దుండగులను శిక్షించాలని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కోరారు. గురువారం ఆయన దళిత సంఘాల నాయకులతో కలసి వనపర్తి డిఎస్పి ని కలిశారు. ఈనెల 4వ తేదీన ఉదయం వేళలో పాఠశాలకు వెళ్తున్న క్రమంలో కొందరు దుండగులు బలవంతంగా బైక్ పై ఎత్తుకెళ్లి అత్యాచారం చేసిన ఘటన జరిగింది. ఈ సంఘటనపై మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు తో పాటు తెలంగాణ దళిత దండు వ్యవస్థాపక అధ్యక్షుడు,మాలల చైతన్య సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మద్దెల రాందాస్, అవుట శ్రీనివాస్, సింగల్ విండో డైరెక్టర్ పసుపుల నరసింహ ప్రస్తుత మాజీ ప్రజాప్రతినిధులు కలిసి మల్లాయిపల్లి గ్రామానికి వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. సంఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా మాజీమంత్రి జూపల్లి బాధిత కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించారు. ఎవ్వరు అధైర్య పడవద్దని నిందితులు ఎంతటివారైనా శిక్ష పడేలా కృషి చేస్తామని, తమకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని భరోసానిచ్చారు. అభం శుభం తెలియని అమ్మాయిలపై ఇలా అత్యాచార ఘటనలకు పాల్పడడం దురదృష్టకరమన్నారు. మరోసారి ఇలాంటివి జరగకుండా నిందితులను చట్టపరంగా కఠినంగా శిక్షించాలని వారు కోరారు.
అనంతరం బాధిత కుటుంబ సభ్యులను తీసుకొని వనపర్తిలోని డీఎస్పీ కార్యాలయానికి వెళ్లి సంఘటనకు సంబంధించిన అంశాలను వివరించారు. మైనర్ బాలికపై ఇలాంటి సంఘటనకు పాల్పడిన వారిపై తక్షణమే కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నిందితులు ఎంతటి వారైనా ఉపేక్షించవద్దని కోరారు. వారితో పాటు వివిధ దళిత సంఘాల కు సంబంధించిన రాష్ట్ర, జిల్లా నాయకులు, ప్రస్తుత, మాజీ ప్రజాప్రతినిధులు టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు తదితరులు ఉన్నారు.