తన పుట్టినరోజు సందర్భంగా కామారెడ్డి జిల్లా బాన్సువాడ రూరల్ మండలం బోర్లం గ్రామంలో తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి మొక్కను నాటారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ హరితహారం అనేది రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన బృహత్తర కార్యక్రమమని తెలిపారు. చెట్లు మానవ మనుగడకు మూలాధారం. ప్రకృతి దేవుని వరం. ప్రకృతిని ధ్వంసం చేయకూడదు, కాపాడుకుని ముందు తరాలకు అందించాలి. అది మన బాధ్యత. ప్రకృతిని మనం కాపాడితే, ఆ ప్రకృతి మనలను కాపాడుతుంది. ప్రతి గ్రామంలో, వీధులలో చెట్లను నాటి సంరక్షించాలి అని ఆయన పిలుపునిచ్చారు.
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమానికి తోడుగా రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ చేపట్టిన “గ్రీన్ ఇండియా చాలెంజ్” పిలుపులో భాగంగా రాష్ట్రంతో పాటుగా దేశ విదేశాలలో కూడా పెద్ద ఎత్తున మొక్కలను నాటుతున్నారని ఆయన తెలిపారు. రాష్ట్రంలోని 12,751 గ్రామాలలో పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేయడం జరిగింది. అనారోగ్యం సమస్యలు ఉన్న వారు గ్రామంలోని ప్రకృతి వనాలలో కూచుంటే స్వచ్చమైన ఆక్సిజన్ లభిస్తుంది. ఆరోగ్యం బాగుపడుతుందని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరు మూడు మొక్కలు నాటాలనే కార్యక్రమంలో సామాన్య ప్రజల నుండి సెలబ్రిటీల వరకు పాల్గొంటున్నారని స్పీకర్ తెలిపారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి హరితహారం పథకం టార్గెట్ లో భాగమైన 230 కోట్ల మొక్కలు నాటే కార్యక్రమంలో గ్రీన్ ఇండియా చాలెంజ్ ద్వారా 20 కోట్లకు పైగా మొక్కలు నాటారని అంచనా ఉందని ఆయన తెలిపారు.