ఎన్నికల కమిషనర్ ఆదేశాలను పట్టించుకోవద్దని అధికారులకు బహిరంగంగా చెప్పిన రాష్ట్ర పంచాయితీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ఎన్నికల కమిషనర్ డాక్టర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆంక్షలు విధించారు.
ఆయనను గృహ నిర్బంధంలో ఉంచాలని రాష్ట్ర డిజిపికి ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికలు పూర్తి అయ్యే వరకూ ఈ నిర్బంధాన్ని కొనసాగించాలని ఎన్నికల కమిషనర్ ఆదేశాలిచ్చారు.
ఈ గృహనిర్భంధ కాలంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎలాంటి పత్రికా ప్రకటనలు జారీ చేయరాదని, మీడియా సమావేశాలు నిర్వహించరాదని ఆయన ఆంక్షలు విధించారు.
జిల్లా కలెక్టర్లకు, పంచాయితీరాజ్ శాఖ అధికారులను రెచ్చగొడుతున్న మంత్రి చర్యలను నిరోధించడానికి రాజ్యాంగం ప్రకారం తనకు సంక్రమించిన అధికారాలను వినియోగిస్తున్నట్లు నిమ్మగడ్డ రమేష్ కమార్ ఆదేశాలు జారీ చేశారు.
అయితే మంత్రి ఇతర అత్యవసర విషయాలలో తన నిర్ణయాలను తీసుకోవచ్చునని, అధికారికంగా చర్యలు తీసుకోవచ్చునని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ స్పష్టం చేశారు.