అత్త సొమ్ము అల్లుడు దానం.. చేశాడన్న చందాన చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నిర్మించిన టిడ్కో
ఇళ్లను శుక్రవారం గుడివాడలో జగన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మహిళల నుంచి జగన్ కు తీవ్ర నిరసన ఎదురైంది. శుక్రవారం గుడివాడలో ఏర్పాటు చేసిన హెలిపాడ్లో సీఎం దిగుతుండగా మహిళలు నిరసన తెలియజేశారు.
సీఎం పర్యటన సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేసినా… కొందమంది మహిళలు పోలీసుల కన్నుగప్పి హెలిపాడ్ వద్దకు చేరుకుని సీఎం హెలికాఫ్టర్ దిగుతున్న సమయంలో గో బ్యాక్ సైకో సీఎం అంటూ నినాదాలు చేశారు.
మహిళలు నల్ల బెలూన్లను ఎగురవేశారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో నల్లబెలూన్లు ఎగురవేయడం రాష్ట్రంలో సంచలనం రేపుతోంది. గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గం కొడాలి నానికి అడ్డాగా భావిస్తారు.
అయితే రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా తొలి సారిగా సీఎం కు మహిళలు నల్ల బెలూన్లు గాలిలోకి వదలి నిరసన తెలియజేయడం గుడివాడలో నాని ఇమేజ్ ను దెబ్బ తీసినట్లయింది. గుడివాడలో ఎదురు లేదనుకున్న కొడాలి నానికి మహిళలు తమ నిరసన ద్వారా గట్టిగా బుద్ధి చెప్పినట్లు అయింది.
ఇదిలా వుండగా.. టిడ్కో ఇళ్లకు సంబంధించి 1600 మంది లబ్ధిదారులను తొలగించడం, టిడ్కో ఇళ్లు టీడీపీ హాయంలో నిర్మిస్తే.. ఇప్పుడు జగన్ వచ్చి ప్రారంభించడం ఏంటని ప్రశ్నిస్తూ టీడీపీతో పాటు వివిధ ప్రజాసంఘాలు, వామపక్షాల నేతలు కలిసి ఛలో గుడివాడకు పిలుపునిచ్చారు.
ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి హెలీపాడ్కు వంద మీటర్ల దూరంలో మహిళలు నల్ల బెలూన్లను ఎగురవేశారు. సరిగ్గా సీఎం జగన్ గుడివాడలో హెలిపాడ్ దిగుతున్న సమయంలో మహిళలు నల్లబెలూన్లను ఎగురవేశారు. 1600 మంది లబ్ధిదారులను ఎందుకు తొలగించారని, వారి పరిస్థితి ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు.
అధికారంలోకి వచ్చిన నాలుగేళ్ల తర్వాత ఇప్పుడు టిడ్కో ఇళ్లను ప్రారంభించడం ఏంటని నిలదీశారు. సీఎం గుడివాడ పర్యటన నేపథ్యంలో నిరసకు ప్రతిపక్షాలు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈరోజు ఉదయం నుంచి ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలను ఎక్కడికక్కడ అరెస్ట్లు చేశారు.