విజయనగరం పోలీసు పరేడ్ గ్రౌండ్ లో జెండా ఊపి ప్రారంభించిన కలెక్టర్
ఆడ మగ పిల్లల్ని సమానగా పెంచే బాధ్యత తల్లులదేనని విజయనగరం జిల్లా కలెక్టర్ ఎ. సూర్య కుమారి పేర్కొన్నారు. అమ్మాయిలకు పెళ్లి చేయడం, అబ్బాయిలకు ఉద్యోగానికి పంపడం మాత్రమే ముఖ్యమని భావిస్తున్న పరిస్థితి మారాలని, ఈ బాధ్యతను ప్రతి తల్లి తీసుకోవాలని అన్నారు. కూతురు అయిన కొడుకు అయినా జీవితం లో స్థిర పడాలి అనే కోరుకోవాలని, అప్పుడే పెళ్లి ప్రస్తావన తేవాలని అన్నారు.
పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన దిశా జాగృతి యాత్ర కార్యక్రమం లో కలెక్టర్ ముఖ్య అతిధి గా హాజరైనారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తెలిసీ తెలియని వయసు లో అనాలోచితంగా, ఆవేశంగా నిర్ణయాలు తీసుకొని వారి జీవితాలను వారే నాశనం చేసుకుంటున్న యువతను తప్పటడుగులు వేయకుండా చూసే బాధ్యత తల్లి దండ్రులు, ఉపాద్యాయుల తో పాటు మీడియా కూడా పాత్ర వహించాలని కోరారు.
విజయగాథలు చెప్పడం వల్ల మార్పు తేవచ్చు
భవిష్యతును ఎలా నాశనం చేసుకుంటున్నారో బాధితులకు నష్టం జరగకుండా ఇతర యువకుల కు తెలియజేసే సామజిక బాధ్యత తీసుకోవాలన్నారు. అదే విధంగా ఉన్నత విద్య ను పొంది, విజయాలు సాధించిన వారి విజయ గాధలను కూడా చెప్పడం ద్వార కొంత మందిలో స్పూర్తిని నింపవచ్చని అన్నారు. దిశా జాగృతి యాత్ర మంచి ఆలోచన అని పెడద్రోవ పడుతున్న బాల బాలికలకు అవగాహన కల్పిస్తున్న పోలీస్ యంత్రాంగం ప్రయత్నం అభినందనీయమని అన్నారు.
జిల్లా ఎస్.పి దీపికా పాటిల్ మాట్లాడుతూ జిల్లాలో పోక్సో కేసు లు ఎక్కువగా నమోదవుతున్న ప్రాంతాలను గుర్తించి ఆ ప్రాంతాల్లో 18 ఏళ్ళ లోపు బాల బాలికలకు లైంగిక నేరాల పై అవగాహన కలిగించడానికే దిశా జాగృతి యాత్ర చేపడుతున్నామన్నారు.
4 దిశ వాహనాలతో పది రోజుల పాటు యాత్ర
10 రోజుల పాటు 22 పోలీస్ స్టేషన్ల పరిధి లో 450 కిలోమీటర్ల వరకు 4 దిశా వాహనాల ద్వారా ఈ యాత్రను జరుపుతున్నట్లు వివరించారు. ఈ యాత్రలో భాగంగా 6 వ తరగతి నుండి 10 వ తరగతి కలిగించడం జరుగుతుందన్నారు. ముఖ్యంగా మంచి చెడు స్పర్శ ల పై , లవ్ ట్రాప్ , దిశా యాప్ వినియోగం అనే అంశాల పై అవగాహన కల్పిస్తామన్నారు.
మైనర్స్ వివాహాలు చేసుకొని వెళ్ళిపోవడం జరుగుతోందని, తిరిగి వచ్చిన తర్వాత కేసు లు పెడుతున్నారని ఇలాంటి నేరాలు చేసే వారిని జైలు కు పంపుతామని అన్నారు. గత ఏడాది లో 88 పోక్సో కేసు లు నమోదైనాయని ఈ కేసు ల సంఖ్య తగ్గాలంటే అవగాహనా అవసరమని అన్నారు. ఫిర్యాదులు చేయడానికి భయపడే వారి కోసం ఫిర్యాదుల బాక్స్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.
ఈ బాక్స్ లో వచ్చిన ఫిర్యాదులను మహిళా పోలీస్ ద్వారా ఎస్.హెచ్.ఓ లకు పంపడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ జిల్లా జడ్జి లక్ష్మి రాజ్యం మాట్లాడుతూ నేరం జరగక ముందే ఆపగలిగితే బాలలను రక్షించగలమని అన్నారు. కన్నవారి తొందరపాటు వలన అనేక మంది బాలలు శిశు గృహాల్లోను, అనాధలగాను మిగిలిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేసారు.
ఎన్నో చట్టాలు ఉన్నా అవగాహనే ముఖ్యం
బాలికల, మహిళల రక్షణ కు అనేక చట్టాలు ఉన్నప్పటికీ అవగాహన లేకపోవడం తో న్యాయం జరగడం లేదన్నారు. జిల్లా న్యాయ సలహా మండలి తరపున అనేక అవగాహనా కార్యక్రమాలు జరుగుతన్నాయని తరపున బాధితులకు ఉచిత న్యాయ సేవలు అందించడం జరుగుతుందని తెలిపారు .
ఈ కార్యక్రమం లోఏడుగురు మహిళా పోలీసు లకు హెల్మెట్ లను, రాలీ బైక్ లను కలెక్టర్, ఎస్.పి ల చేతుల మీదుగా అందజేశారు. అనంతరం జెండా ఊపి ర్యాలి ని ప్రారంభించారు. సమావేశం లో అదనపు ఎస్.పి లు పి. సత్యనారాయణ, అనిల్, ఓ.ఎస్.డి సూర్య చంద్ర రావు, దిశా డీఎస్పీ త్రినాద్, ఇతర డీఎస్పీ లు, సీఐ లు, ఎస్.ఐ లు మహిళా పోలీసు లు, విద్యార్ధిని లు పాల్గొన్నారు.
ఎం.భరత్ కుమార్, సత్యంన్యూస్.నెట్, విజయనగరం