గతంలో ఎన్నికల ప్రచారానికి సమావేశం నిర్వహించాలంటే కాగితంపై రాసి కార్యాలయాల చుట్టూ తిరిగితే అధికారుల అనుమతులు ఇచ్చేవారు. సమయం వృథా అయ్యేది. ప్రస్తుతం ఎన్నికల సంఘం సువిధ యాప్ ను తీసుకొచ్చింది. అధికారుల వద్దకు వెళ్లాల్సిన పనిలేదు. యాప్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే అనుమతులు జారీచేస్తారు. ప్రస్తుతం ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. నామినేషన్ వేయగానే అభ్యర్థులు సభలు, సమావేశాలపై దృష్టి సారిస్తారు. ర్యాలీలతో హోరెత్తిస్తారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ఎన్నికల సంఘం ప్రచార పర్వంలో నిబంధనలు విధించింది. అభ్యర్థులు ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించాలన్నా ముందస్తు అనుమతులు పొందాల్సి ఉంటుంది. దీని కోసం సువిధ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఇలా దరఖాస్తు చేయాలి
చరవాణిలో గూగుల్ ప్లేస్టోర్ నుంచి సువిధ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. సమావేశం నిర్వహించే వివరాలతో పాటు ఏ విధమైన అనుమతులు కావాలో యాప్లో నమోదు చేయాలి. మీసేవలో చలానా చెల్లించాలి. చలానా రసీదు, సువిధలో నమోదు చేసిన వివరాలు రిటర్నింగ్ అధికారి కార్యాలయంలోఅందజేయాలి. దరఖాస్తు ఎన్నికల అధికారికి చేరిన 48 గంటల్లోగా ఎలాంటి జాప్యం చేయకుండా అనుమతులు జారీ చేస్తారు. ఏదైనా కారణంతో అనుమతుల్లో జాప్యం జరిగితే సంబంధిత రిటర్నింగ్ అధికారికి దరఖాస్తు చేసుకోవచ్చు.
వీటికి అవసరం
ప్రచారంలో వినియోగించే కార్లు, ద్విచక్ర వాహనాలు, ఇంటింటి ప్రచారానికి, ప్రజలతో కలిసి ర్యాలీలు నిర్వహించేందుకు, సభల నిర్వహణ, సమావేశాలు ఏర్పాటు చేయడానికి, తాత్కాలిక ఎన్ని కల కార్యాలయం ఏర్పాటు చేయడానికి, లౌడ్ స్వీకర్లు, జెండాలు, గోడపత్రికలు, కరపత్రాల , వీడియో ఆడియో ల వినియోగం తదితర వాటి కోసం అనుమతులు తీసుకోవాలని ములుగు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారిణి ఇలా త్రిపాఠి ఒక గురువారం ప్రకటనలో తెలిపారు.