‘‘నేను రాను బిడ్డో సర్కారు దవఖానకు’’ అంటు ఆనాడు ఎవరో కడుపు మండినోళ్లు చెప్పారని సర్దుకున్నాం…కానీ ఇప్పటికీ అదే పరిస్థితి అంటూ ఈ సంఘటనలు రుజువు చేస్తున్నాయి.
కరోనా సమయంలో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు ప్రభుత్వం పదే పదే చెబుతున్నా క్షేత్ర స్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ మొన్న గాంధీ ఆసుపత్రిని సందర్శించారు.
నేడు వరంగల్ ఎంజిఎం ఆసుపత్రిలో ఆయన పర్యటించారు. అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెబుతున్నారు.
అయితే సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో పరిస్థితులు ఏ మాత్రం బాగా లేవని బయటకు వస్తున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి.
ఇవన్నీ ప్రజల్ని భయబ్రాంతుల్ని చేయడం కోసం కాదు. వాస్తవ పరిస్థితిని వెల్లడించేందుకే అని భావించాలి.
ఇదే విషయాన్ని వీడియోలు పంపిన వారు కూడా చెబుతున్నారు. టీఆర్ఎస్ పార్టీ మైనారిటీ నాయకుడు ఒకరు తన తల్లిని కోల్పోయారు.
కరోనాతో సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చేరి ప్రాణాలు కోల్పోయారు. సిద్దిపేట నివాసి, టీఆర్ఎస్ నాయకుడు మరొకరు తన తండ్రిని కోల్పోయారు.
సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలోని దీనావస్థను ఆయన వివరించి వీడియో విడుదల చేశారు. ఈ వీడియోలు చూసి అయినా ప్రభుత్వ ఆసుపత్రుల్లో పరిస్థితులు మెరుగుపరుస్తారని ఆశిద్దాం.