ఎట్టకేలకు జనుంపల్లి శ్రీనివాసరావు ఎలియాస్ కోడికత్తి శ్రీనుకు ఏపీ హైకోర్టులో భారీ ఊరట లభించింది. జగన్ రెడ్డిపై జరిగిన కోడికత్తి దాడి కేసులో నిందితుడు జనపల్లి శ్రీనివాసరావు. గత ఐదు సంవత్సరాలుగా అతను బెయిల్ దొరక్క జైల్లో మగ్గుతున్నాడు. అలాంటి కోడికత్తి శ్రీనుకు ఏపీ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. కేసు వివరాలు మీడియాతో మాట్లాడొద్దని, ర్యాలీలు, సభల్లో పాల్గొనద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు తీర్పుపై దళిత, పౌర సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
కోడికత్తి కేసులో గత ఐదేళ్లుగా నిందితుడు శ్రీనివాస్ అలియాస్ కోడికత్తి శీను జైలులోనే మగ్గుతున్నాడు. ఇప్పటికీ రిమాండ్ ఖైదీగానే జైల్లోనే ఉన్న శ్రీనివాస్ ఆవేదన వర్ణనాతీతం. ఈ కేసుకు సంబంధించి శీను కుటుంబసభ్యులు అనేకమార్లు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి నివాసానికి వెళ్లినప్పటికీ ఫలితం శూన్యం. బాధితుడిగా ఉన్న సీఎం జగన్ నిరభ్యంతర పత్రం ఇవ్వాలని, బెయిల్కు అడ్డంకులు తొలగించాలని అభ్యర్థించినప్పటికీ ముఖ్యమంత్రి నేటికీ స్పందించలేదు. దీంతో శ్రీనివాస్ నేటికి కూడా రిమాండ్ ఖైదీగానే జైల్లో ఉండిపోయాడు.
ఈ క్రమంలో తనకు న్యాయం జరిగే వరకూ జైలులోనే దీక్ష చేశాడు. అతని ఆరోగ్యం క్షీణించడంతో అధికారులు జైలులోని అతనికి చికిత్సను అందించే ఏర్పాట్లు చేశారు. మరోవైపు కోడికత్తి శీను తల్లి, సోదరుడు సైతం నిరాహార దీక్ష చేశారు. న్యాయం కోసం ఎంతగానో పోరాడారు. మొత్తానికి కోడికత్తి శ్రీనుకు నేడు బెయిల్ లభించింది.