ఎస్సీ ,ఎస్టీలకు అమరావతి బహుజన ఐకాస బాలకోటయ్య బహిరంగ లేఖ
పురాణాల్లో ఏకచక్రపురం అనే గ్రామం ఉండేది. ఆ గ్రామానికి బకాసురుడు అనే రాక్షసుడు రాజుగా ఉండేవాడు. ప్రతి రోజూ బండెడు అన్నం, రెండు దున్న పోతులు,ఒక మనిషిని తినేవాడు. అన్న కథలు విన్నాం. చదివాం. కానీ చూడలేదు. నాలుగేళ్ళ వైకాపా పాలన ఏపీని ఏకచక్రపురంగా మార్చింది. రాష్ట్రంలో ఉన్న గనులు, భూములు, ఇసుక, మద్యం వంటి అన్ని సహజ వనరులను భోంచేస్తూ, ఎస్సీ ,ఎస్టీ లను నంజుకొని తింటుందని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య ధ్వజమెత్తారు.
గతంలో ముఖ్యమంత్రి కి, డిజిపి కి, మానవ హక్కుల కమిషన్ కు పలు లేఖలు రాసిన ఆయన మంగళవారం రాష్ట్రంలో ఉన్న కోటి 20 లక్షల ఎస్సీ, ఎస్టీలకు బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో వారానికి నలుగురు దళిత, గిరిజన మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయని, రోజుకు సగటున ఏడు దాడులు,నెలకు ముగ్గురు హత్య చేయబడుతున్నారని చెప్పారు.
2021లో ఎస్సీలపై 32 హత్యలు,44 అత్యాచారాలు,1491ఇతర కేసులు, 116 పిఒఏ యాక్ట్ కేసులు వెరసీ మొత్తం 2,323 సంఘటనలు, ఎస్టీలపై 8 హత్యలు, 69 దాడులు, 30 అత్యాచారాలు, 272 ఇతర కేసులు,14 పీఒఎ యాక్ట్ కేసులు వెరశి 394 సంఘటనలు జరుగినట్లు పేర్కొన్నారు. కేంద్రానికి రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ పంపిన నివేదిక ఆధారంగా ఎస్సీ,ఎస్టీలపై దాడులు గణనీయంగా పెరిగినట్లు నివేదించినట్లు తెలిపారు.
కుప్పలు తెప్పలుగా ఎట్రాసిటీ కేసులు పెండింగ్లో ఉన్నాయని, 2018లో 4,427 ఉండగా, 2021కి 7,360 కేసులు పెండింగ్లో ఉన్నాయి అన్నారు. ఎస్సీ, ఎస్టీల మీదనే అధికంగా ఎందుకు దాడులు జరుగుతున్నాయి? వీటికి పరిష్కారం ఏమిటి? అన్న ప్రశ్నలపై నాలుగేళ్ళలో ముఖ్యమంత్రి అధ్యక్షతన ఒక్క సమీక్ష సమావేశం కూడా జరగలేదని, ఏ ఒక్క బాదిత కుటుంబాన్ని సిఎం ఓదార్చ లేదన్నారు.హత్య చేసి డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీ అనంత బాబుకి గజమాలలు,సన్మానాలు చేస్తుంటే, ఆకృత్యాలు ఎలా తగ్గుతాయి? అని ప్రశ్నించారు.
డాక్టర్ సుధాకర్, డాక్టర్ అచ్చెన్న, డ్రైవర్ సుబ్రహ్మణ్యం, చీరాల కిరణ్, బాపట్ల అమర్నాథ్, పులివెందుల నాగమ్మ, నంద్యాల మహాలక్ష్మి , గుంటూరు భూక్యా రమాకాంత్, అంగన్వాడీ టీచర్ నూకాయమ్మ వంటి సంఘటనలు దేనికి నిదర్శనం అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, మహిళా కమిషన్ లు ఉన్నాయా? తాళాలు వేశారా? ఆని ప్రశ్నించారు. కేంద్రం లోని మానవ హక్కుల కమిషన్, మహిళా కమిషన్ ఏం చేస్తున్నాయి? అని మండిపడ్డారు.
రాష్ట్రంలో నిస్సహాయులైన ఎస్సీ, ఎస్టీలపై దాడులు, హత్యలు జరుగుతుంటే, ఐపీసీ కాస్త వైసీపీగా మారిందని ఆరోపించారు. రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ లపై జరుగుతున్న మానవ హననం పై ఎస్సీ ఎస్టీ లు, దళిత సంఘాల నాయకులే పలు రూపాలలో ఉద్యమించాల్సిన అవసరం ఎంతైనా ఉందని లేఖలో విజ్ఞప్తి చేశారు.ఎవరో వస్తారు,ఏదో చేస్తారన్న ఊహాగానాలు మాని డాక్టర్ అంబేద్కర్ స్ఫూర్తితో ఉద్యమించాలని ఎస్సీ ఎస్టీలకు బాలకోటయ్య పిలుపునిచ్చారు.