TSPSC ప్రశ్నాపత్రాల లీకేజి వ్యవహారంలో కేసీఆర్ ప్రభుత్వం డైవర్ట్ పాలిటిక్స్ చేస్తోందని, అందుకే టెన్త్ పరీక్షా పత్రాల వ్యవహారం బయటకు తీసుకువచ్చిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. జైలు నుంచి విడుదలైన బండి సంజయ్ రాష్ట్ర ముఖ్యమంత్రిపై తీవ్ర ఆరోపణలు చేశారు. వాళ్లది లిక్కర్ కుటుంబం, లీక్ల కుటుంబమని ఆరోపించారు. త్వరలోనే కూతురు జైలుకు వెళ్తుందని.. కొడుకు పై కూడా కేసులు రెడీ చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో కొందరు పోలీస్ వ్యవస్థ కి మచ్చ తెచ్చేలా వ్యవహరిస్తున్నారని,ఓ లోక్ సభ సభ్యునితో పోలీసులు వ్యవహరించే తీరు ఇదేనా అని మండపడ్డారు.
మా అత్త దశ దిన కర్మ లో నేను పాల్గొని ఉండాల్సిన సమయంలో పోలీసులు అరెస్టు చేసి తీసుకు వెళ్ళడాన్ని ప్రస్తావిస్తూ, వారికి కనీస ఎమోషన్స్ లేవన్నారు. కొంత మంది పోలీస్ అధికారుల వ్యవహారం వల్ల కింది స్థాయి సిబ్బంది ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. మొబైల్ ఫోన్ ఇవ్వాలని కోరుతున్న పోలీసులపై ఆయన నా మొబైల్ ఫోన్ వారికి ఇవ్వడం ఎందుకని ప్రశ్నించారు. ప్రశ్న పత్రాల లీకేజ్ తో రాష్ట్రం ఆందోళనలతో అట్టుడికి పోతుంటే ముఖ్యమంత్రి మాత్రం బయటకు రావడం లేదన్నారు. పరీక్షల లీకేజ్ కారణంగా నష్టపోయిన అభ్యర్థులకు లక్ష రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
పదవ తరగతి ప్రశ్నా పత్రాల వ్యవహారంలో హిందీ పేపర్ లీక్ చేశామని మాపై ఆరోపణ చేసి కేసు నమోదు చేశారు.. మరి పరీక్షల మొదటి రోజే తెలుగు పేపర్ ని ఎవరు లీక్ చేసారు? వారిని ఎందుకు అరెస్ట్ చేయలేదని సూటిగా ప్రశ్నించారు. పదవ తరగతి ప్రశ్నా పత్రాల లీకేజ్ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. టీఎస్పీఎస్ ప్రశ్నాపత్రాల లీకేజ్ వ్యవహారంలో మంత్రి కే తారక రామారావును బర్తరఫ్ చేయాలని కోరారు. త్వరలో వరంగల్ లో నిరుద్యోగులతో భారీ ర్యాలీ నిర్వహిస్తామని చెప్పారు. పార్టీ ఆధ్వర్యంలో అన్ని జిల్లా కేంద్రాలలో నిరుద్యోగ మార్చ్ నిర్వహిస్తామన్నారు.