తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ తన 5 వ విడత పాదయాత్ర ముగింపు సభను తన నియోజకవర్గంలో ఈ నెల 15 వ తేదీన నిర్వహించనున్నారు. ఆ ముగింపు సభకు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ముఖ్య అతిథిగా హజరుకానున్నారు.ఈ నేపథ్యంలో పార్లమెంట్ స్థాయి విస్తారక్ సమావేశంలో 2023 ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా పనిచేయాలని సంజయ్ ఆదేశించారు. ఇటీవల నూతనంగా నియమించిన పార్లమెంట్ నియోజకవర్గ విస్తారక్ లతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ సమావేశమయ్యారు.
మెట్ పల్లిలోని ప్రజా సంగ్రామ యాత్ర లంచ్ శిబిరం వద్ద జరిగిన ఈ సమావేశానికి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, దుగ్యాల ప్రదీప్ కుమార్, బంగారు శ్రుతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ పోలింగ్ బూత్ మొదలు పార్లమెంట్ నియోజకవర్గ వ్యాప్తంగా చేపట్టాల్సిన కార్యక్రమాలతోపాటు మిషన్-2023 పేరిట రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా పనిచేయాలని నిర్దేశించారు.
పార్లమెంట్ నియోజకవర్గాల్లోనే పూర్తిగా మకాం వేసి రాబోయే పార్లమెంట్ ఎన్నికల వరకు పూర్తిస్థాయిలో పార్టీ సంస్థాగత బలోపేతంతోపాటు బీజేపీ గెలుపే లక్ష్యంగా పని చేయాలని కోరారు. అలాగే 15న కరీంనగర్ లో బహిరంగ సభ ఏర్పాట్లపై బండి సంజయ్ సమీక్షించారు.
పోలింగ్ బూత్ స్థాయి కార్యకర్తలందరినీ సభకు తరలించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా గత బహిరంగ సభలను తలదన్నేలా కరీంనగర్ లో నిర్వహించే బహిరంగ సభ దిగ్విజయవంతమయ్యేలా చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ప్రధాన కార్యదర్శులను ఆదేశించారు.
రాష్ట్రంలోని అన్ని పోలింగ్ బూత్ కమిటీ సభ్యుల నుండి మొదలు రాష్ట్ర స్థాయి నాయకులు, వివిధ మోర్చాల కార్యకర్తలు, నాయకులందరినీ కరీంనగర్ బహిరంగ సభకు తీసుకురావాలని, అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. జిల్లాల వారీగా జన సమీకరణ, వాహనాల సేకరణ వంటి అంశాలపైనా లోతుగా చర్చించారు. ఈ సమావేశంలో గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, దుగ్యాల ప్రదీప్ కుమార్, బంగారు శ్రుతి పాల్గొన్నారు.