టిఎస్ ఆర్టిసి సంస్థ అయ్యప్ప స్వామి భక్తులకు శుభవార్త తెలిపింది. నవంబర్, డిసెంబర్, జనవరి నెలలో అయ్యప్ప స్వామి భక్తులు పవిత్ర మాల ధారణతో అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి శబరిమల వెళ్లి రావడం ఆనవాయితీగా వస్తుంది. అయ్యప్ప స్వామి భక్తులు ప్రైవేటు సంస్థల బస్సులను ఆశ్రయించి నష్టపోకుండా, సురక్షితమైన ప్రయాణాన్ని అందిస్తూ రాయితీతో బస్సులను టిఎస్ఆర్టిసి సంస్థ ఏర్పాటు చేస్తున్నది.
తెలంగాణ రాష్ట్రంలోని అయ్యప్ప స్వామి భక్తులు శబరిమల యాత్రను సురక్షితంగా వెళ్లి రావడానికి అనువుగా టిఎస్ ఆర్టిసి సంస్థ భక్తుల కోసం కొంత రాయితీపై ప్రత్యేక టిఎస్ఆర్టిసి బస్సులను సమకూరుస్తున్నామని సంస్థ చైర్మన్, నిజామాబాద్ గ్రామీణ నియోజకవర్గ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్ తెలిపారు. టిఎస్ఆర్టిసి సంస్థ బస్సులలో అనుభవజ్ఞులైన డ్రైవర్లతో కూడిన బస్సుల్లో సురక్షితంగా ప్రయాణం చేయవచ్చునని చెప్పారు.
శబరిమల యాత్ర బస్సులపై ఎలాంటి డిపాజిట్ లేకుండా 10% రాయితీపై సూపర్ లగ్జరీ, డీలక్స్,ఎక్స్ప్రెస్ బస్సులను ఏర్పాటు చేస్తున్నారు. అదనపు సీట్ల కోసం ఇద్దరు గురుస్వాములు, ఇద్దరు వంట మనుషులు, 12 సంవత్సరాలు లోబడిన మణికంఠ స్వాములు, ఒక అటెండర్ ఉచితంగా ప్రయాణం కల్పిస్తున్నామని చెప్పారు. శబరిమల యాత్ర బస్సును బుకింగ్ చేసిన గురుస్వామికి ప్రయాణం ఉచితం.
టిఎస్ ఆర్టిసి వారి ప్రత్యేక బస్సులలో ఆడియో మరియు వీడియో తోపాటు మొబైల్ ఛార్జింగ్ సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. ఈ బస్సును అయ్యప్ప స్వాములు కోరుకున్న ప్రదేశం నుండి దర్శించ వలసిన పుణ్యక్షేత్రాల వరకు నడుపుతారు. TSRTC బస్సులలో ముందస్తు సీట్ రిజర్వేషన్, శబరిమల యాత్రకు కావలసిన ఆర్టీసీ బస్ అద్దె బుకింగ్ ల కోసం www.tsrtconline.in సందర్శించాలి. అడ్వాన్స్ బుకింగ్ పై 10% రాయితీ ఉంటుంది. సలహాలకు, సూచనలకు, ఫిర్యాదుల కోసం TSRTC కాల్ సెంటర్ 040 23450033, 69440000 సంప్రదించవచ్చు.