సీఎం జగన్ అభివృద్ధి చేస్తున్న ప్రజా రంజక పాలన, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని, పార్టీ విజయమే లక్ష్యంగా కార్యకర్తలు, నాయకులు కృషి చేయాలని రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి పిలుపునిచ్చారు. ఈ మేరకు నగరంలోని నాగవంసపు వీధి జంక్షన్లో జరిగిన 20,21,50వ డివిజన్లకు సంబంధించి జరిగిన జోనల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం జగన్ అభివృద్ధి, సంక్షేమాన్ని రెండు కళ్ళుగా భావించి పాలన సాగిస్తున్నారని అన్నారు.
అందుకే ఎక్కడికి వెళ్ళినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమానికి ప్రజల నుండి విశేష స్పందన లభిస్తోందని అన్నారు. అదే పరిస్థితులలో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ చేపట్టిన బాదుడే బాదుడు కార్యక్రమానికి ప్రజల నుంచి స్పందన కానరాలేదని అన్నారు. పాదయాత్రలో ప్రజల అవసరాన్ని చూసి నేను ఉన్నాను, నేను విన్నాను అని ప్రజలకు చెప్పి, ఎన్నికల సమయంలో నవరత్నాల మేనిఫెస్టో తయారుచేసి , వైఎస్సార్ అధికారం చేపట్టిన దగ్గర నుంచి , ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా కృషి చేస్తున్నారని అన్నారు.
వాలంటరీ వ్యవస్థ, సచివాల వ్యవస్థ ద్వారా ప్రభుత్వ పాలనను ప్రజల వద్దకే తీసుకువచ్చారని అన్నారు. 2019 వ సంవత్సరంలో ఎన్నికల సమయంలో విజయనగరం నియోజకవర్గంలో జోనల్ వ్యవస్థను తీసుకువచ్చి , అందరి కృషితో విజయం సాధించడం జరిగిందన్నారు. ప్రస్తుతం అదే జోనల్ వ్యవస్థను కొనసాగిస్తున్నామని అన్నారు. 1984 నుంచి సామాన్య కార్యకర్తగా రాజకీయాల్లో ప్రవేశం చేయడం జరిగిందన్నారు. తన 38 ఏళ్ల రాజకీయ జీవితంలో గెలిచిన, ఓడిన ప్రజలతో మమేకమై పని చేస్తున్నానని అన్నారు.
తన వెనుక ఉన్నది కార్యకర్తలేనని, పార్టీకి కార్యకర్తలు వెన్నెముక లాంటి వారని అన్నారు. తన రాజకీయ జీవితంలో అవినీతి, లంచగొండితనం లేకుండా ప్రజలతో మమేకమై పని చేస్తున్నానని అన్నారు. గత పాలకుల హయాంలో ఐదు రోజులకు ఒకసారి మంచినీరు పంపిణీ జరిగేదని, ప్రస్తుతం రోజు విడిచి రోజు నీరు పంపిణీ చేస్తూ, 2019 నుంచి ఇప్పటివరకు మూడు వేసవికాలంలో ప్రజలకు మంచినీటి బాధలు లేకుండా చేశామన్నారు. తనపై చెప్పడానికి ఎటువంటి ఆరోపణలు లేకపోవడంతో, అమ్మవారి సిరీమాను పండుగ రోజున విఐపి ప్రవేశ ద్వారానికి డిప్యూటీ స్పీకర్ కోలగట్ల గేటుకు తాళం వేసుకుని కూర్చున్నారని, అశోక్ గజ పతి రాజు విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు.
దీనిని బట్టి చూస్తే సామాన్యుల వెతలు ఆయనకు అక్కరలేదని తెలుస్తోందని అన్నారు. సామాన్య ప్రజలకు దర్శనం సక్రమంగా చేయించాలని ఉద్దేశంతో తాను గేటుకు తాళాలు వేసానన్న సంగతి సామాన్యులకు తెలుసునని అన్నారు.
కరోనా కష్టకాలంలో బంగ్లా గేటుకు తాళాలు వేసుకున్న వీరు , తనపై ఆరోపణలు చేయడం ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. కరోనా కష్టకాలంలో తాను రోడ్లపై తిరుగుతూ, ప్రతి డివిజన్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అండగా ఉంటూ భరోసా కల్పించింది అనేదానికి నగరపాలక సంస్థ ఎన్నికలలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘనవిజయమే నిదర్శనం అని అన్నారు. ఈ సందర్భంగా పార్టీ నియమావళి, కమిటీల ఏర్పాటు తదితర అంశాలపై ముద్రించిన పుస్తకాలను పార్టీ నాయకులకు అందజేశారు.
జోనల్ ఇంచార్జ్ మరియు కార్పొరేటర్ కంటు భుక్త తవిటి రాజు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జోనల్ ఇంచార్జ్ కాళ్ల సూరిబాబు, పార్టీ నాయకులు సుంకర సత్యారావు, రాష్ట్ర నాగవంస కార్పొరేషన్ డైరెక్టర్ అవనాపు లక్ష్మణరావు, రెడ్డిక కార్పొరేషన్ డైరెక్టర్ రౌతు భాస్కర్ రెడ్డి, 21వ డివిజన్ పార్టీ అధ్యక్షులు కనకల గిరి, 20 డివిజన్ పార్టీ అధ్యక్షులు పచిగుళ్ల కృష్ణమూర్తి, కార్పొరేటర్లు కనకల నాగవల్లి, పట్టా ఆదిలక్ష్మి, పార్టీ నాయకులు అవనాపు రాజు, కనకల రమేష్, కనకల అప్పన్న, మో కర సతీష్ తదితరులు ఉన్నారు.