సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి సన్నిధిలో రెండవ రోజు వసంత పంచమి వేడుకలు కన్నుల పండువగా జరుగుతున్నాయి. బుధవారం తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. అమ్మవారి సన్నిధిలో తమ చిన్నారులకు అక్షరాభ్యాసం చేయిస్తున్నారు.
సరస్వతి అమ్మవారిని దర్శించుకుని ముక్కులు తీర్చుకుంటున్నారు. అమ్మవారి దర్శనానికి రెండు గంటల సమయం పడుతున్నది. పోలీసులు, దేవాదాయ శాఖ అధికారులతో కలిసి భక్తులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. క్యూలైన్లలో నిలబడిన భక్తులకు మంచినీరు, చిన్నారులకు పాలు, బిస్కట్లు అందచేస్తున్నారు.
వసంత పంచమి ని పురస్కరించుకుని భక్తుల రద్దీ దృష్ట్యా ఎన్ సి సి విద్యార్థులు, నిర్మల్ కు చెందిన మహిళా వాలంటీర్ల తో పాటు పోలీసు సిబ్బంది భక్తులకు ఇబ్బందులు కలగకుండా సేవలందిస్తున్నారు. ఆలయం పరిసర ప్రాంతాల్లో పారిశుద్ధ్య సమస్యలు తలెత్తకుండా స్థానిక గ్రామ పంచాయతీ సిబ్బంది, వాగ్దేవి లేబర్ సొసైటీ కార్మికులు విధులు నిర్వర్తిస్తున్నారు.
వరంగల్ అర్బన్ ఆర్డిఓ వెంక రెడ్డి తమ కుమార్తెకు అక్షరాభ్యాసం పూజలు నిర్వహించారు. వ్యాసపురి కన్యకా పరమేశ్వరి ఛారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మూఢ నాగభూషణం గుప్త మనమడు నిహాన్ కు అమ్మవారి సన్నిధిలో వేద పండితులు వేద మంత్రోచ్ఛారణల మధ్య అక్షరాభ్యాసం పూజలు జరిపిన అనంతరం దర్శించుకున్నారు.
వీరితో పాటు పలువురు ప్రముఖులు అమ్మవారిని దర్శించుకున్నారు. వసంత పంచమి ఉత్సవాల్లో నేడు సరస్వతి అమ్మవారి జన్మదినం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు, స్థానిక ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి , తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు.