ప్రతీ ఆడబిడ్డలో చిరునవ్వును చూడాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్ష అని హుజుర్ నగర్ శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి అన్నారు.
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని టౌన్ హాల్, మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం పట్టణ ప్రజలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సైదిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి సంస్కృతీ సంప్రదాయాలు ప్రతిబింబించేలా అన్ని మతాల వారికి సిఎం కెసిఆర్ ప్రోత్సాహకాలు అందిస్తున్నారని అన్నారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో పాటు రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు నడిపిస్తున్నారని, రాష్ట్రంలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఆడబిడ్డలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తున్నట్లు సైదిరెడ్డి తెలిపారు.
ముఖ్యమంత్రి కెసిఆర్ మనసున్న మహారాజని,సంక్షేమ పథకాల రూపకల్పన అమలులో తెలంగాణ రాష్ట్రం ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నదని అన్నారు. బతుకమ్మ పండుగకు చిరుకనుకగా తెలంగాణ ఆడబిడ్డలకు ప్రభుత్వం బతుకమ్మ చీరల పంపిణీ చేపడుతోందని, సమైక్య పాలకులు బతుకమ్మ గొప్పతనాన్ని విస్మరించారని విమర్శించారు. ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత బతుకమ్మ గొప్పతనాన్ని ప్రపంచ దేశాలు సైతం గుర్తించి కీర్తిస్తున్నాయని అన్నారు.
తెలంగాణ సంస్కృతీ,సంప్రదాయాలకు బతుకమ్మ ప్రతీకగా నిలుస్తున్నదని కొనియాడారు. టిఆర్ఎస్ ప్రభుత్వం పేద ప్రజలను ఆర్థికంగా ఆదుకునేందుకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందని,కళ్యాణ లక్ష్మి పథకంతో పేదింటి ఆడబిడ్డల పెండ్లికి 1,00,116 రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తుందని అన్నారు. కరోనా లాంటి సంక్షోభ పరిస్థితుల్లో నేతన్నలకు ప్రభుత్వం చేయూతనందించి ఆదుకుంటున్నదని అన్నారు. గత ఆరు సంవత్సరాల నుంచి ఆడపడుచులకు బతుకమ్మ కానుకగా ప్రభుత్వం చీరలు పంపిణీ చేస్తున్నదని అన్నారు.
బతుకమ్మ పండుగ సందర్భంగా ఆడబిడ్డలకు చీరలను కానుకగా అందించడతో పాటు నేతన్నలకు ఉపాధి భరోసా కల్పించాలనే ద్విముఖ వ్యూహంతో ప్రభుత్వం ప్రతీ ఏటా చీరల పంపిణీ చేపడుతోందని అన్నారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో చేనేత కార్మికులను ప్రభుత్వం ఆదుకుందని,ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలో నేత కార్మికులకు ఇచ్చిన వాగ్దానాలకు,హామీలకు కట్టుబడి ప్రభుత్వం పని చేస్తున్నదని అన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో చేనేత కార్మికుల బలవన్మరణాలు పూర్తిగా ఆగిపోయాయని అన్నారు. సిఎం కెసిఆర్ చేనేత రంగానికి జీవం పోశారని అన్నారు.
ఈ సంవత్సరం కోటి మందికి పైగా యువతులకు,మహిళలకు ప్రభుత్వం బతుకమ్మ చీరలను పంపిణీ చేయనుందని అన్నారు. తద్వారా ప్రత్యక్షంగా 15 వేల మంది నేత కార్మికులకు,పరోక్షంగా 20 వేల మందికి ప్రతీనెల 20 వేల రూపాయలు ఉపాధి లభిస్తున్నదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం టెస్మో వస్త్రాలకు బ్రాండింగ్ కల్పించే దిశగా ప్రయత్నిస్తున్నదని, బతుకమ్మ చీరలు నేత కార్మికుల ఉపాధికి భరోసా కల్పిస్తున్నాయని అన్నారు.
ఇటీవల కాలంలో చేనేత వస్త్రాలపై యువతులకు, మహిళలకు ఆసక్తి పెరిగిందన్నారు. రేషన్ కార్డులో పేరుండి 18 సంవత్సరాలు నిండిన యువతులకు,మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తున్నామని అన్నారు. కరోనా కేసుల దృష్ట్యా చీరలను అడబిడ్డల ఇండ్లకే పంపించే ఏర్పాట్లు చేసినట్లు సైదిరెడ్డి తెలిపారు. బతుకమ్మ చీరలు అందుకున్న ఆడబిడ్డలు సిఎం కు ఆశీర్వచనాలు అందజేశారని అన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం సంక్షేమ పథకాల రూపకల్పన అమలులో దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని అన్నారు.
సత్యం న్యూస్, హుజూర్ నగర్