పదో తరగతి ఫలితాల్లో మహాత్మా జ్యోతిబాఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాలల విద్యార్థులు అత్యధిక మార్కులు కైవసం చేసుకున్నారు. బిసి గురుకుల విద్యార్థులు 97.53 శాతం ఉత్తీర్ణత సాధించి తమ సత్తా చాటారు. రాష్ట్ర సగటు కంటే ఎక్కువ శాతం ఉత్తీర్ణత సాధించారు.
విద్యా ద్వారానే తమ జీవితాల్లో మార్పు వస్తుందని గట్టిగా నమ్మిన తెలంగాణ ప్రభుత్వం వెనుకబడిన వర్గాల కోసం 281 గురుకులాలను నిర్వహిస్తోంది, అత్యున్నత స్థాయి ప్రమాణాలతో అత్యుత్తమ విద్యా బోధనను అందిస్తోంది, కరోనా కలిగించిన ఆటంకాలను లెక్కచేయకుండా బిసి విద్యార్థులు చదువుపై ధ్యాస పెట్టి పదోతరగతిలో ఉత్తీర్ణత సాధించి ప్రభంజనం సృష్టించారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 142 మహాత్మా జ్యోతిబాఫూలే బిసి గురుకుల పాఠశాల్లో 77 పాఠశాలలు నూటికి నూరు శాతం ఉత్తీర్ణత సాధించాయి. పదో తరగతి పరీక్ష మొత్తం 10645 మంది విద్యార్థులు రాయగా అందులో 10381 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. బాలుర కంటే బాలికలు ముందంజలో ఉన్నారు. బాలురు 96.83 శాతం, బాలికలు 98.04 శాతం పాస్ అయ్యారు. అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థుల సంఖ్య గతం కంటే ఎక్కువ ఉందని అధికారులు తెలిపారు.
కరోనా సమయంలో విద్యార్థులందరికీ ఆన్ లైన్ ద్వారా తరగతులు నిర్వహించి, విద్యార్థులకు ఉపాధ్యాయులు అందుబాటులో ఉంటూ ఎప్పటికప్పుడు వారికి అవసరమైన సూచనలు అందించడంతోనే తమ పిల్లలు మంచి మార్కులతో పాస్ అయ్యారని తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
మెరుగైన ఫలితాలు సాధించిన విద్యార్థులను, విద్యార్థులు మంచి మార్కులు సాధించేలా పాఠాలు చెప్పిన ఉపాధ్యాయులను బిసి సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్, ప్రిన్సిపల్ సెక్రెటరీ బుర్రా వెంకటేశం, కార్యదర్శి మల్లయ్య బట్టు ఒక ప్రకటనలో అభినందించారు. ప్రభుత్వం కల్పిస్తున్న వసతులను ఉపయోగించుకుని విద్యార్థులంతా ఉన్నత విద్యను అభ్యసించాలని వారు ఆకాంక్షించారు.