23.2 C
Hyderabad
May 8, 2024 00: 32 AM
Slider ప్రత్యేకం

వత్తిడికి లోను కాకుండా పరీక్షలకు సిద్ధంకండి

#sabitaindrareddy

ఏప్రిల్ 3వ తేదీ నుంచి ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు ప్రారంభ‌మ‌వుతాయ‌ని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి తెలిపారు. ప‌రీక్ష‌లు ఉద‌యం 9:30 గంట‌ల‌కు ప్రారంభ‌మ‌వుతాయ‌ని, 9:35 గంట‌ల వ‌ర‌కు మాత్ర‌మే విద్యార్థుల‌ను అనుమ‌తిస్తామ‌ని మంత్రి స్ప‌ష్టం చేశారు. ప‌ది ప‌రీక్ష‌ల హాల్ టికెట్ల‌ను ఇప్ప‌టికే ఆయా పాఠ‌శాల‌ల‌కు పంపించామ‌ని, వెబ్‌సైట్ నుంచి కూడా డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చ‌ని మంత్రి పేర్కొన్నారు.

పదో తరగతి పరీక్షలపై జిల్లా కలెక్టర్లతో మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి బుధ‌వారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. ప‌ది పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఎలాంటి ఒత్తిడి, ఆందోళనకు లోను కాకుండా సంసిద్ధం కావాలని సూచించారు. పరీక్షలపై విద్యార్థులకు ఉన్న సందేహాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేసి, వారిలో మనోధైర్యాన్ని నింపాల్సిన బాధ్యత ఆయా యాజమాన్యాలతో పాటు ఉపాధ్యాయుల‌కు, తల్లిదండ్రులకు ఉందన్నారు. లక్షలాది మంది విద్యార్థులు హాజరవుతున్న ప‌ది పరీక్షలను పారదర్శకంగా, సజావుగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

ప‌రీక్షా కేంద్రాల వ‌ద్ద సీసీ కెమెరాలు

రాష్ట్ర వ్యాప్తంగా 4,94,620 మంది విద్యార్థులు పరీక్షలకు హాజర‌వుతార‌ని, 2,652 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. ప‌రీక్ష‌ల‌ నిర్వహణలో జిల్లా కలెక్టర్ల పాత్ర కీలకమని మంత్రి పేర్కొన్నారు. ప్రస్తుతం ఎండల తీవ్రత పెరిగే అవకాశం ఉన్నందున, పరీక్ష కేంద్రాల వద్ద ప్రత్యేక జాగ్రత్తలతో పాటు విద్యార్థులకు అవసరమైన సదుపాయాలు, తాగునీరు, ఓఆర్ఎస్ అందుబాటులో ఉంచాలని కోరారు. విద్యార్థులకు మంచి వాతావరణంలో పరీక్షలు రాసేందుకు సౌకర్యాలు కల్పించాలని సూచించారు. పరీక్షలను పారదర్శకంగా నిర్వహించేందుకు పరీక్ష కేంద్రాల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాల‌ని, ఎప్పటికప్పుడు వాటిని మానిటరింగ్ చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పరీక్షలు సజావుగా జరిగేందుకు ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.

విడివిడిగా భౌతిక శాస్త్రం, జీవ‌శాస్త్రం పేప‌ర్లు

హాల్​టికెట్లను సంబంధిత పాఠశాలలకు ఇప్పటికే పంపటం జరిగింద‌ని మంత్రి పేర్కొన్నారు. విద్యార్థులే స్వయంగా డౌన్​లోడ్ చేసుకునే అవకాశం కల్పించామని తెలిపారు. ఈ విద్యా సంవత్సరం నుండి పరీక్షా పేపర్లను 11 నుంచి 6 పేప‌ర్ల‌కు కుదించడం జరిగిందని, సైన్స్ పరీక్షా రోజున భౌతిక శాస్త్రం, జీవ శాస్త్రంకు సంబంధించి ప్రశ్నా పత్రాలను, జ‌వాబు ప‌త్రాల‌ను విడివిడిగా అందించడం జరుగుతుందని తెలిపారు.

హాల్ టికెట్ చూపిస్తే ఆర్టీసీ బ‌స్సుల్లో ఫ్రీ జ‌ర్నీ

విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా తాము చదివిన పాఠశాలలకు సమీపంలోనే పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. రోజు వారి పరీక్షల నిర్వహణ చేయడం కోసం జిల్లా వారీగా ప్రత్యేకంగా పరిశీలకులను నియమిస్తున్నామన్నారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు తమ హాల్ టికెట్ చూపించి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేసే సౌకర్యం కల్పించినట్లు మంత్రి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో విద్యా శాఖ కార్యదర్శి వాకాటి కరుణ, పాఠశాల విద్యా శాఖ సంచాలకురాలు శ్రీ దేవసేన తదితరులు పాల్గొన్నారు.

Related posts

కరీంనగర్ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి గంగుల

Satyam NEWS

ఫిబ్రవరి 1 నుండి మినీ మేడారం సమ్మక్క సారలమ్మ జాతర

Satyam NEWS

స్వలాభం కోసమే కందాల పార్టీ మారారు

Bhavani

Leave a Comment