ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండల కేంద్రంలో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు నిర్వహిస్తూ అక్రమ మద్యం వ్యాపారం చేస్తున్న నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ టిప్పు సుల్తాన్ యూత్ ఆధ్వర్యంలో స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా టిప్పు సుల్తాన్ యూత్ అధ్యక్షుడు వసీం ఖాన్ మాట్లాడుతూ మండల కేంద్రంలో ప్రతి వీధిలో కిరాణా దుకాణాలలో బెల్ట్ షాపులను నిర్వహిస్తూ గుడుంబా, మద్యం విక్రయిస్తున్నప్పటికీ ఎక్సైజ్ శాఖ అధికారులు దృష్టి సారించకపోవడంతో మద్యం విక్రయాలు జోరుగా జరుగుతున్నాయని అన్నారు.
రోజు కూలి నాలీ చేసుకునే వారు తాము చేసిన పనులకు వచ్చిన డబ్బులను బెల్ట్ షాపుల్లోనే మద్యానికి ఖర్చు పెడుతుండడంతో వారి కుటుంబాలు గడవని పరిస్థితి నెలకొని గొడవలకు కారణం అవుతున్నాయని అన్నారు. ఎక్సైజ్ శాఖ అధికారులు బెల్ట్ షాపు నిర్వాహకులపై చర్యలు తీసుకొని మద్యం విక్రయాలను కొనసాగించకుండా అడ్డుకట్ట వేయాలని,లేనిపక్షంలో తమ యువజన సంఘం ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఫిర్యాదు చేసిన వారిలో షెహజాద్, హుస్సేన్, కలీమ్, మున్నా తదితరులు పాల్గొన్నారు.