ప్రజల బలహీనతలను ఆసరాగా తీసుకుని ఆన్ లైన్, ఇన్ స్టెంట్ లోన్ పేరిట రుణాలిస్తామంటూ మాయమాటలు చెప్పి మోసగాళ్ల బారిన పడవద్దని వై.ఎస్.ఆర్ జిల్లా ఎస్.పి కే.కే.ఎన్ అన్బురాజన్ సూచించారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో లోన్ యాప్స్ పట్ల అప్రమత్తం చేస్తూ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన పోస్టర్లను ఆవిష్కరించారు.
ఈ సందర్బంగా జిల్లా ఎస్.పి మాట్లాడుతూ డాక్యుమెంట్ లెస్ వెరిఫికేషన్, ఇన్ స్టెంట్ లోన్, 10 నిమిషాలలో లోన్ మంజూరు చేస్తామంటూ ఆఫర్ల పేరిట వచ్చే మెసేజ్ ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, క్లిక్ చేసి ఇబ్బందుల్లో పడవద్దని తెలిపారు. ఆన్ లైన్, ఇన్ స్టెంట్ లోన్ యాప్స్ బారిన పడి మీతో పాటు మీ స్నేహితులు, బంధువులను చిక్కుల్లో పడేసిన వారవుతారని ఎస్.పి తెలిపారు.
ఆఫర్లు నమ్మి లోన్ తీసుకుంటే కాంటాక్ట్స్, గ్యాలరీ, తదితర వ్యక్తిగత సమాచారాన్ని యాప్ నిర్వాహకులకు యాక్సెస్ ఇవ్వాల్సి ఉంటుందని (Agree) ఆ పై వేధింపులు తప్పవని, ఫోటోలు మార్ఫింగ్ చేసి మీ వద్ద ఉన్న కాంటాక్ట్స్ అందరికీ పంపిస్తారన్నారు. త్వరగా లోన్ వస్తుందని ఆశపడితే బంధువులను సైతం రిస్క్ లో పెట్టినట్లే అవుతారని ఎస్.పి హెచ్చరించారు. పేపర్ డాక్యుమెంటేషన్ అవసరం ఉండదని, సులువుగా లోన్ పొందవచ్చని ప్రజలు లోన్ యాప్ ల బారిన పడి తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారని గుర్తుంచుకోవాలన్నారు.
లోన్ యాప్స్ ద్వారా మోసం చేస్తారిలా…
లోన్ యాప్స్ ను ప్లే స్టోర్ నుండి డౌన్ లోడ్ చేసుకొని అందులో మొదటగా మీ మొబైల్ నెంబర్ ద్వారా రిజిస్టర్ అవుతారు. మీ వ్యక్తిగత ఫోన్ నంబర్స్, సమాచారం అన్నింటిని తప్పనిసరిగా అనుమతించాలి. ఆ తర్వాత మీకు అవసరమైన ఆ మొత్తాన్ని చెల్లించేందుకు ఉన్న సమయ కాలాన్ని చూపిస్తూ ఒక నోటిఫికేషన్ వస్తుంది. మీరు వాటిలో ఏదో ఒకటి ఎంపిక చేసుకున్న తర్వాత మీ మొబైల్ నెంబర్ కు ఒక ఓటిపి వస్తుంది. మీరు ఆ ఓటిపిని ఎంటర్ చేసిన తర్వాత మీకు మీ ఖాతా నందు డబ్బు జమ అవడం కోసం ఈ క్రింద లింకు పై క్లిక్ చేయమని ఉంటుంది.
మీరు ఆ లింకు ను క్లిక్ చేయగానే మీ మొబైల్ నందలి సమాచారం ఆ లోన్ ఇచ్చే వారి సర్వర్ నందు స్టోర్ అవుతుంది. ఆ తర్వాత మీ ఖాతా వివరాలు నమోదు చేసుకుంటారు. మీరు ఎంచుకున్న మొత్తానికంటే మీ ఖాతా నందు జమ అయ్యే మొత్తం చాలా తక్కువగా ఉంటుంది. ఇలా తీసుకున్న మొత్తాన్ని తిరిగి చెల్లించ వలసిన సమయం పూర్తవ్వకముందే తిరిగి చెల్లించవలసినదిగా లేనిపక్షంలో వారిని అసభ్య పదజాలంతో తిడుతూ ఆన్ లైన్ లోన్ ఇచ్చిన వారి నుండి కాల్స్ వస్తాయి.
మీరు తిరిగి చెల్లించాల్సిన గడువును పెంచుకున్నట్లయితే మీరు తిరిగి చెల్లించాల్సిన మొత్తానికి వడ్డీ రేట్లు అధికం గా ఉంటాయి. ఒక వేళ మీరు ఆ మొత్తాన్ని చెల్లించని పక్షంలో మీ ఫోన్ నందు గల కాంటాక్స్ కు మిమ్మల్ని దూషిస్తూ మీరు ఒక మోసగాడని కాల్స్, మెసేజ్స్ పంపుతారు.
అంతేకాకుండా మీ ఫోటోలు మార్ఫింగ్ చేసి కూడా మీ కాంటాక్ట్స్ లో ఉన్న బంధువులు, స్నేహితులకు పంపుతారు. దానికి భయపడి గౌరవ మర్యాదలు గురించి ఆలోచించి కొందరు జీవితమే వద్దని భావించే అవకాశముంది. అలాంటి సందర్భాలలో భయపడకుండా దగ్గర్లో ఉన్న పోలీసులను సంప్రదించండి. కావున ఇటువంటి ఆన్ లైన్ లోన్ యాప్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచనలు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
మీరు లోన్ తీసుకునే appకు RBI గుర్తింపు ఉందో లేదో చెక్ చేసుకోండి.
మీరు ఇటువంటి ఆన్ లైన్ apps ను నమ్మకండి. రుణం తీసుకోవడం చేయకండి.
మీకు రుణం అవసరం అనుకుంటే బ్యాంక్ నందు కానీ లేదా మీకు తెలిసిన వ్యక్తుల నుండి రుణం తీసుకోవడం మంచిది.
ఎవరైనా ఈ విధంగా మోసపోతే https://cybercrime.gov.in లేదా సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్ 1930 కు, లేదా సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ ఫోన్ నెంబర్ 9121100693 కి లేదా సమీప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని జిల్లా యస్.పి. అన్బురాజన్ విజ్ఞప్తి చేశారు. పోస్టర్ల ఆవిష్కరణ కార్యక్రమం లో ఫ్యాక్షన్ జోన్ డి.ఎస్.పి చెంచు బాబు, సైబర్ క్రైమ్ సెల్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ నాయుడు, ఎస్.ఐ మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు.