బక్రీద్ పండుగను శాంతియుత వాతావరణంలో ఎవరికి ఇబ్బంది కలిగించకుండా జరుపుకోవాలని డిఐజి ఏ.వి. రంగనాధ్ కోరారు.
బుధవారం నల్లగొండ జిల్లా పోలీసు కార్యాలయంలో ముస్లిం పెద్దలు, హిందూ సంస్థల ప్రతినిధులు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ బక్రీద్ పర్వదినోత్సవ సందర్భంగా పశువుల తరలింపు విషయంలో అన్ని రకాల అనుమతులు, నిబంధనలు పాటించాలని, ప్రభుత్వ నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
పశువుల తరలింపులో వెటర్నరీ శాఖ అధికారులు ధృవీకరించన తర్వాత అనుమతించడం జరుగుతుందని చెప్పారు. గోవుల తరలింపుపై నిషేధం ఉన్న క్రమంలో నిబంధనలు పాటించకుండా గోవులను తరలిస్తే కేసులు నమోదు చేస్తామన్నారు.
అన్ని వర్గాల ప్రజలు, ప్రజా ప్రతినిధులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా పోలీసులతో సహకరించాలని సూచించారు. మత విద్వేషాలు రెచ్చగొట్టే వ్యక్తులపై, వారి కదలికలపై నిఘా పెట్టడం జరిగిందని చెప్పారు.
సమావేశంలో గోలి మధుసూదన్ రెడ్డి, వీరెల్లి చంద్రశేఖర్, హఫీజ్ ఖాన్, ముంతాజ్ అలీ, ఎస్.బి. డిఎస్పీ రమణా రెడ్డి, నల్లగొండ వన్ టౌన్, టూ టౌన్ సిఐ బాలగోపాల్, చంద్రశేఖర్ రెడ్డి, టూ టౌన్ ఎస్.ఐ. నర్సింహులు, శాంతి సంఘం సభ్యులు తదితరులున్నారు.