ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి అడ్డంకులు సృష్టించినా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమా భీమ్లా నాయక్ బిగ్గెస్ట్ హిట్ అయింది. పవర్స్టార్ అభిమానులలో ఈరోజు పండగ వాతావరణం నెలకొంది. పవర్స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ ఈరోజే భారీ ఎత్తున థియేటర్లలో విడుదలైంది. తొలి షో నుంచి సినిమాకు సూపర్ హిట్ టాక్ రావడంతో థియేటర్లు కలెక్షన్లతో దద్దరిల్లుతున్నాయి.
దీంతో పవర్స్టార్ అభిమానుల హంగామా మాములుగా లేదు. ఇప్పటికే సోషల్ మీడియాలో సినిమా టాక్ గురించి తెగ చర్చ నడుస్తోంది. హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్ల వద్ద బ్యానర్లు, డప్పులు, దండలు.. ఇలా పవన్ అభిమానుల ఉత్సాహం ఉరకలెత్తుతోంది.
సినిమా చూసిన జనాలు అంతా కూడా ఒకే మాట చెబుతున్నారు. ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ చేసిన సినిమాల్లో ది బెస్ట్ ఇదేనని, నటన అదిరిపోయిందని, యాటిట్యూడ్ చూపించడంలో పవన్ కళ్యాణ్ను మించిన వారు లేరంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. ప్రిరిలీజ్ బిజినెస్ దాదాపు 50 కోట్లు దాటడంతో తెలుగు చిత్ర పరిశ్రమ మొత్తం ఊపిరి పీల్చుకున్నది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినిమా టిక్కెట్ల రేట్ల పైనా, బెనిఫిట్ షోలపైనా దారుణ ఆంక్షలు విధించడంతో ఆంధ్రా, రాయలసీమ మార్కెట్ లు కలెక్షన్ల పరంగా డల్ గా ఉంటాయని ముందుగానే ఊహించారు.
అయితే తెలంగాణ, ఓవర్సీస్ బిజినెస్ ఊహించిన దానికన్నా ఎక్కువ కావడంతో నిర్మాతలతో బాటు పవన్ కల్యాణ్ ‘‘సేఫ్ జోన్’’ లోకి వెళ్లిపోయారు. పైగా టేబుల్ ప్రాఫిట్ రావడంతో ఇక ఆంధ్రాలో సినిమా టిక్కెట్ల ధరల గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదని వారు అనుకుంటున్నారు. ప్రభుత్వం అణచి వేసేందుకు చేసే ప్రయత్నాలు తనను, తన సినిమాను ఏమీ చేయలేవని పవన్ కల్యాణ్ ముందు నుంచి చెబుతూనే ఉన్నారు. అలానే జరిగింది. భీమ్లానాయక్ సినిమా అతి పెద్ద హిట్ గా నిలిచింది.