మంగళగిరిలో రాజకీయ జేఏసీ ఆధ్వర్యంలో నేడు భారీ బైక్ ర్యాలీ జరిగింది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, సీపీఐ నేతలు నారాయణ, ముప్పాళ్ల నాగేశ్వరరావు తదితరులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. మంగళగిరి పరిధిలోని గ్రామాల రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం, నవులూరు, ఎర్రబాలెం, పెనుమాక గ్రామాల్లో పర్యటించిన లోకేష్ రైతులకు సంఘీభావం తెలిపారు.
సీపీఐ నేత నారాయణను బైక్పై వెనుక కూర్చొబెట్టుకుని లోకేష్ బండి నడిపారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ అందరి సూచనల మేరకే అమరావతిలో రాజధాని ఏర్పాటు చేశారని అన్నారు. రైతు ప్రభుత్వం అంటూనే రైతులను జగన్ అవమానించారని ఆయన అన్నారు. జగన్ నోటితో మూడు రాజధానులు వద్దు.. అమరావతి ముద్దు అనే వరకూ ఈ ఉద్యమం ఆగదని లోకేష్ తెలిపారు.
30 రోజుల నుంచి జరుగుతున్న ఈ పోరాటంలో రైతులను కించపరుస్తూ వైకాపా ప్రజా ప్రతినిధులు మాట్లాడటం దారుణమని ఆయన అన్నారు. రైతులను పేయిడ్ ఆర్టిస్టులంటు అనటం, రైతులు ఫ్యాంట్ లు వేసుకున్నారని, ఐ ఫోన్ వాడుతున్నారని ఇలా అనేక ఆరోపణలు చేయడం దురదృష్టకరమని లోకేష్ అన్నారు. రైతులు ఫ్యాంట్ లు వేసుకోవటం తప్పా, వారు ఎదగటం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంకు ఇష్టం లేదని స్పష్టం అవుతుందని లోకేష్ అన్నారు.