జీహెచ్ఎంసీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ మాటల తూటాలు పేలుస్తూ.. మరోవైపు వరాల జల్లులు కురిపిస్తూ ముందువరుసలో ఉండగా, మొన్నటి దుబ్బాక ఎన్నికల విజయం జోష్లో బీజేపీ కూడా అదేస్థాయిలో జోష్లో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ మేనిఫెస్టో ప్రజలను ఆకట్టుకునే విధంగా ఉండడంతో బీజేపీ కూడా ఏమైనా చేయాలని భావించిందో? ఏమో? అగ్రనేతలైన అమిత్షా, ముఖ్యమంత్రి సీఎం యోగి ఆదిత్యనాథ్, జేపీ నడ్డాలతోపాటు మరికొంతమంది బీజేపీ నేతలు ఎన్నికల ప్రచారానికి భాగ్యనగరానికి రానున్నట్లుగా దీనికి సంబంధించిన షెడ్యూల్ను విడుదల చేయనున్నట్లు సమాచారం. కాగా వారు ఎప్పుడు వస్తారు? ఎక్కడెక్కడ ప్రచారం నిర్వహిస్తారనే విషయాలు కూడా షెడ్యూల్లో పేర్కొనే అవకాశం ఉంది.
ఒకవేళ బీజేపీ అగ్రనేతలు ప్రచార రంగంలోకి దిగితే ఇక గ్రేటర్ ఎన్నికలు ఢీ అంటే ఢీ అన్నట్లుగా వార్ వన్ సైడ్ కాకుండా వార్ టూ సైడ్ అవుతాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇక ముచ్చటగా మూడో స్థానంలో ఉన్నకాంగ్రెస్ ప్రచారంలో ఆపసోపాలు పడుతున్నప్పటికీ పార్టీ నాయకత్వ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. ఆయాచోట్ల ఉన్న ఒక బలమైన నాయకునికి సరైన సమన్వయం లేకపోవడంతో ఆయన మాటల తూటాలకు అంతగా పనిలేనట్లుగా పార్టీ వర్గాలే చేశాయనే అంతర్గత ఆరోపణలతో హస్తం పార్టీ ఆవేదనలో ఉన్నట్లు సమాచారం.
ఏది ఏమైనా భాగ్యనగర్ ఎన్నికల్లో ఓటర్లు టీఆర్ఎస్ వైపు మొగ్గుచూపుతారా? లేదా బీజేపీ వైపా? లేదా మరింకేదైనా పార్టీ వైపా అనేది సమయమే తేల్చాలి. ఎన్నికల విశ్లేషణలు ఎంతటి మహానుభావులు, విశ్లేషకులు చేసినా ప్రజాతీర్పు మాత్రం ఎప్పటికీ ఎవ్వరికీ అందని ద్రాక్షేనని అందరికీ తెలిసిందే!