తెలంగాణ సిద్ధించిందే ఉస్మానియా యూనివర్సిటీ నుంచి అని, యావత్ తెలంగాణ యువత ఇటునుంచే ప్రేరణ పొంది తెలంగాణ సాధించుకున్నారని అప్పుడు లేని అడ్డగింతలు, కుప్పిగంతులు ఇప్పుడు ఎందుకని బీజేవైఎం జాతీయ అధ్యక్షులు, ఎంపీ తేజస్వీ సూర్య ప్రశ్నించారు. పోలీసులతో తనను అడ్డుకోవాలని చూడడం దుర్మార్గమన్నారు. మరీ తెలంగాణ ఉద్యమం కోసం అప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులను ఎలా భాగస్వాములను చేశారని అప్పుడు చేస్తే ఒక లెక్క ఇప్పుడు చేస్తే మరో లెక్కనా? అని నిలదీశారు. సూర్య పర్యటన నేపథ్యంలో ముందే తెలుసుకున్న పోలీసులు ఓయూవద్ద భారీగా పోలీసులను మోహరించినప్పటికీ బీజేపీ కార్యకర్తలు గేట్లు, గోడలు దూకి లోపలికి ప్రవేశించారు. 1969లో తెలంగాణ కోసం అమరులైన వీరులను స్మరించుకునేందుకు తాను ఓయూకు వచ్చానని తేజస్వీ సూర్య స్పష్టం చేశారు. తెలంగాణలో మార్పులకు, విప్లవానికి ఓయూ కేంద్రమన్నారు.
అనంతరం సూర్య మాట్లాడుతూ బంగారు తెలంగాణ అని కేసీఆర్ అన్నారు కానీ తాను ఇప్పుడు వస్తుంటే ఎక్కడా అలా మారిన సందర్భాలు చూడలేదన్నారు. ఆ పార్టీ నేతలకే బంగారం దక్కినట్టుందేమోనని ఎద్దేవా చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికలు తెలంగాణ ప్రజల స్వాభిమానానికి, భవిష్యత్కు, ఆత్మగౌరవానికి సంబంధించినవని దీని కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధమేనని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణను అవినీతిమయంగా కేసీఆర్ మార్చారని ఆరోపించారు. ఇక్కడ ఉన్నదే ఇద్దరేనా? వారు కేసీరావు, కేటీరావు.. ప్రజలకు మాత్రం ఏమీ రావా? అని ఏద్దేవా చేశారు. ప్రధాని మోదీ అంటే కేసీఆర్కు భయం పట్టుకుంటుందని రోజురోజుకు మోదీకి ప్రజల్లో పెరుగుతున్న క్రేజ్ను చూసి వారికి చెమటలు పడుతున్నాయని అన్నారు. మోదీ నాయకత్వంలో సరికొత్త తెలంగాణను అతి త్వరలో తెలంగాణ ప్రజలు చూడబోతున్నారని ఆయన పేర్కొన్నారు.
తేజస్వీ సూర్య పర్యటనను అడ్డుకునేందుకు పోలీసులు పూర్తి స్థాయిలో సమాయత్తం కాగా, బీజేపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో రావడంతో ముళ్లకంచెలు, గేట్లను చేధించుకుంటూ ఆయన ఓయూలోకి వెళ్ళడం విశేషం.