కామారెడ్డి జిల్లా కేంద్రంలోని టెక్రియల్ బైపాస్ జాతీయ రహదారిపై టిఆర్ఎస్ చేపట్టిన ధర్నాకు బీజేపీ గట్టి కౌంటర్ ఇచ్చింది. ధర్నాతో ఆ ప్రాంతం అపవిత్రమైందని బీజేపీ ఆధ్వర్యంలో శుద్ధి చేశారు. వేద పండితునితో పూజ చేయించి ధర్నా ప్రాంతన్ని పసుపు నీళ్లు, సానీటైజర్, ఫినాయిల్ చల్లి శుభ్రం చేశారు.
ధర్నా ప్రాంతంలో పారవేసిన ప్లాస్టిక్ బాటిళ్లు, ఇతర వ్యర్థాలను ఏరి పారేశారు. ఈ సందర్బంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కాటిపల్లి వెంకట రమణారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో నియంత్రిత వ్యవసాయాన్ని చేయించేలా ఆంక్షలు విధించి భయపెడితే రైతులు అడుగంటిపోయారన్నారు.
కేంద్ర ప్రభుత్వం తెచ్చిన చట్టం ద్వారా రాష్ట్రంలోనే కాకుండా దేశంలో ఎక్కడైనా రైతులు ధాన్యం విక్రయించుకునే అవకాశం కల్పించిందన్నారు. ఈ చట్టం తప్పని చెప్తూ నాయకులు చేసే పనిని మర్చిపోయేలా రైతులను పక్కదోవ పట్టిస్తున్నారని అన్నారు.
జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్బంగా ఇంటికి పది వేల సహాయం అందించారని, రైతులు నష్టపోతే ఒక్కరూ కూడా పరామర్శించిన పాపాన పోలేదని విమర్శించారు. నెల రోజుల క్రితం నాలుగు వేల మంది రైతులు ఇదే ప్రాంతంలో ధర్నా చేస్తే నేటి ధర్నాలో ఎంతమంది రైతులున్నారో వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని చెప్పారు.
నాడు ధర్నా చేసిన సందర్బంగా పది మంది నాయకులు, 30 మంది రైతులపై జిల్లా ఎస్పీ కేసులు నమోదు చేశారని, నోటీసులు అందజేశారని గుర్తు చేశారు.
నేటి ధర్నా సందర్బంగా ఎంతమందిపై కేసులు చేస్తారో ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నామని చెప్పారు. ధర్నాలో కింద కూర్చుంటే కాలుతుందని కార్పెట్లు వేసుకుని, కుర్చీలపై కూర్చుని వినూత్న రీతిలో ధర్నాలో పాల్గొన్నారని విమర్శించారు