భారత దేశ రాజధాని ఢిల్లీ మహా నగరంలో 100 రోజులకు పైగా గడ్డకట్టే చలిలో, వర్షంలో కటికనేల మీద మూడు చట్టాలు రద్దు కోసం రైతులు ఆందోళన చేస్తుంటే దేశ ప్రధాని కి చీమకుట్టినట్లు కూడా లేదని, ఇలాంటి ప్రధాని ప్రజా సమస్యలను గాలికి వదిలేసి పెట్టుబడిదారులకు బాగు కోసం కష్టపడే ప్రధాని మోదీ ప్రపంచంలో ఎక్కడా లేడని జిల్లా సి ఐ టి యు ఉపాధ్యక్షుడు శీతల రోషపతి విమర్శించారు.
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం మఠంపల్లి మండల రఘునాధపాలెం గ్రామంలో హమాలీ కార్మికులు, బిల్డింగ్ రంగ కార్మికుల జనరల్ బాడీ సమావేశంలో పాల్గొన్న రోషపతి మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి డెబ్భై నాలుగు సంవత్సరాల కాలంలో వీర తెలంగాణ రైతాంగ పోరాట చరిత్ర తర్వాత మరల అంతటి పోరాటం ఢిల్లీ మహా నగరంలో రైతుల పోరాటం అని కొనియాడారు.
కేంద్ర ప్రభుత్వం స్పందించి ప్రైవేటీకరణ ఆపాలని, వ్యవసాయ చట్టాల సవరణ నిలుపుదల చేయాలని కోరారు.కార్మిక చట్టాల సవరణ నిలుపుదల చేయాలని 57 సంవత్సరాలు దాటిన కార్మికులకు కనీసం నెలకు 3000 పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో మఠంపల్లి మండల భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షుడు జె బాలాసౌరెడ్డి, మేస్త్రీలు CITU నాయకులు బత్తిని బాబు, ఎస్ కే భాషా, వి.కొండలు, మౌలాలి, నాయుడు, షరీఫ్, లాల్ జాన్ పాషా, తదితరులు పాల్గొన్నారు.