అకాల వర్షంతో నష్టపోయిన పంటలకు పరిహారం చెల్లించాలని భారతీయ జనతా కిసాన్ మోర్చా ములుగు జిల్లా అధ్యక్షులు జింనుకల కృష్ణాకర్ రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
జిల్లా కేంద్రంలోని సోమవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ 15 రోజుల క్రితం కురిసిన వర్షాలు జిల్లాలోని రైతుల పాలిట శాపాలుగా మారాయని అన్నారు. కురిసిన వర్షాలతో జిల్లాలోని లక్ష ఎకరాలకు పైగా పంట నష్టం జరిగిందన్నారు.
వర్షలు తగ్గముఖం పట్టి 16 రోజులు గడిచినా రైతులు నష్టపోయిన పంటలను అధికారులు సర్వే నిర్వహించకపోవడం వారి నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు.
లక్షల రూపాయలు అప్పులు తెచ్చి ఆరుగాలం కష్టపడి పంట వేసిన రైతులకు మొదటి దశలోనే అకాల వర్షాలతో ఎదురుదెబ్బ తగిలిందని, రైతులకు నష్టపరిహారం ప్రకటించకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తూ రైతుల పై సవతి తల్లి ప్రేమను చూపిస్తూందని అన్నారు.
పెద్ద మొత్తంలో ఆస్తి నష్టం జరిగి ఉండడానికి గూడు లేని నిరుపేదలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు 30 వేల రూపాయల చొప్పున నష్ట పరిహారం చెల్లించాలని కోరారు.
అకాల వర్షాలతో నేల కూలిన ఇళ్లకు బదులు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించి ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. లేనిపక్షంలో రాబోవు రోజుల్లో ప్రభుత్వ కార్యాలయాల ముందు భారతీయ జనతా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఆందోళన తీవ్రతరం చేస్తామని డిమాండ్ చేశారు.