పశ్చిమ బెంగాల్ లో బిజెపి నాయకుడిని దారుణంగా కాల్చి చంపారు. ఉత్తర పరగణాల జిల్లాలోని తితాఘర్ వద్ద మోటారు సైకిల్ పై వచ్చిన ఇద్దరు అగంతకులు కాల్చివేశారు. స్థానిక కౌన్సిలర్ గా ఉన్న మనీష్ శుక్లా దుండగుల కాల్పులకు నేలకు ఒరగగానే సమీపంలోని ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు.
అయినా ఫలితం లేకపోయింది. ఆదివారంనాడు జరిగిన ఈ సంఘటన బిజెపి, తృణమూల్ కాంగ్రెస్ మధ్య రాజకీయ స్పర్ధ రేకెత్తించింది. అధికార తృణముల్ కాంగ్రెస్ రాజకీయంగా అడ్డు తొలగించుకోవడానికి శుక్లాను హత్య చేయించిందని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాష్ వర్ఘీయ అన్నారు.
బిజెపి ఎంపి అర్జున్ సింగ్ కూడా తృణమూల్ కాంగ్రెస్ చేసిన హత్యగా దీన్ని పేర్కొన్నారు. అయితే బిజెపిలోని అంతర్గత పోరాటాల వల్లే శుక్లా హత్య జరిగిందని తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు నిర్మల్ ఘోష్ అన్నారు. శుక్లా హత్య ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని బిజెపి డిమాండ్ చేస్తున్నది.