తాను ఏ విధమైన అవినీతికి పాల్పడలేదని వేదపండితుల మధ్య కాణిపాకంలో సత్యదేవుడు ముందు బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి ప్రమాణం చేశారు.
ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి టిప్పు సుల్తాన్ విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతుంటే అడ్డుకున్నందుకు విష్ణువర్ధన్ రెడ్డి పై వ్యక్తిగత విమర్శలు చేశారు.
ఆయన విష్ణువర్ధన్ రెడ్డిపై అవినీతి ఆరోపణలు కూడా చేయడంతో కాణిపాకంలో సత్య దేవుడి ఎదుట ప్రమాణం చేద్దామని విష్ణువర్ధన్ రెడ్డి పిలుపునిచ్చారు.
నేడు చిత్తూరు జిల్లా కాణీపాకం చేరుకున్న విష్ణువర్ధన్ రెడ్డి ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి కోసం కొద్ది సేపు వేచి చూశారు. ఆయన రాకపోవడంతో విష్ణువర్ధన్ రెడ్డి సత్యదేవుని ఎదుట ప్రమాణం చేశారు.
తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని, ఒక్క రూపాయి అవినీతి కూడా చేయలేదని ఆయన తెలిపారు. ఏ ఆశ్రమము, మఠం వద్ద నుంచి డబ్బులు తీసుకోలేదు అలాగే తాను ఏ రకమైన రాజకీయ అవినీతికి పాల్పడలేదని ప్రమాణం చేశారు.
23 సంవత్సరాల రాజకీయ జీవితంలో నిజాయితీగా ఉన్నానని, ఈ రోజు ఎమ్మెల్యే తనపై తప్పుడు ఆరోపణలు చేసినందున తాను సత్యదేవుడి ఆలయంలో, అధికారులు, వేదపండితులు బిజెపి శ్రేణుల సమక్షం లో ప్రమాణం చేస్తున్నాను అని ప్రమాణం చేశారు.
ఎమ్మెల్యే రాచమల్లు మహిళలను అవమాన పరిచి మాట్లాడారని, అయితే తాను రాచమల్లు ఇంట్లోని ఆడబిడ్డలను తన కుటుంబ సభ్యులుగా భావించి పసుపు కుంకుమ చీర పంపుతానని విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు.
కాణిపాకం ప్రమాణానికి రాకుండా ఎమ్మెల్యే పారిపోయాడని విష్ణువర్ధన్ రెడ్డి ఆరోపించారు. టిప్పు సుల్తాన్ పై ఎనలేని ప్రేమ చూపిస్తున్న ఎమ్మెల్యే రాచమల్లు కు హిందూ ఆలయాల పట్ల నమ్మకం లేక పోవచ్చు కానీ తనకు ఉన్నాయని విష్ణు అన్నారు.
ఇకనైనా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే కు, ఇతర వైసీపీ నేతలకు మంచి బుద్దిని ప్రసాదించాలని స్వామి వారిని కోరుకుంటున్నానని విష్ణు తెలిపారు.