కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ప్రజాహిత పథకాలన్నీ నేరుగా ప్రజల వద్దకు చేరే విధంగా చూడాల్సిన బాధ్యత పార్టీ నాయకులపై ఉందని హైదరాబాద్ సెంట్రల్ జిల్లా బీజేపీ అధికార ప్రతినిధి, వెంగల్ రావు నగర్ డివిజన్ ఇంచార్జ్ ఏడేలి అజయ్ కుమార్ అన్నారు. భారతీయ జనతా పార్టీ వెంగల్ రావు నగర్ డివిజన్ ముఖ్య నాయకుల సమావేశం నేడు జరిగింది. డివిజన్ అధ్యక్షులు ఎన్.విజయ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఏడెల్లి అజయ్ కుమార్ హాజరయ్యారు.
తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు అన్నిటినీ ప్రజలు గమనిస్తున్నారని ఆయన అన్నారు. రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీని బూత్ స్థాయిలో పటిష్టం చేయాలని ఆయన కోరారు. పోలింగ్ బూత్ వరకూ పార్టీని ఓటర్లకు మరింత చేరువ చేసే దిశలో కార్యక్రమాల రూపకల్పన జరగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు బాల ప్రకాష్, కీలారి మనోహర్, అట్లూరి రామకృష్ణ, కాలేరు రవీందర్, సుప్రియ గౌడ్, అల్లం సంగీత ఈశ్వర్, మహేందర్, రాఘవేంద్ర, జబ్బర్, వెంకటేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.