తీవ్ర ఉత్కంఠ రేపిన దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికలో బిజెపి గెలిచింది. ఆ పార్టీ అభ్యర్థి మాధవనేని రఘునందన్రావు తన సమీప ప్రత్యర్థి టీఆర్ఎస్ కు చెందిన సోలిపేట సుజాతపై విజయం సాధించారు.
ఓట్ల లెక్కింపులో తొలి రౌండ్ నుంచి బిజెపి ఆధిక్యం ప్రదర్శించింది. 19,20 రౌండ్లలో కాస్త తడబడినప్పటికీ చివరిలో పుంజుకుని అంతిమంగా బిజెపి విజయాన్ని సాధించింది.
మొత్తం 23 రౌండ్లలో జరిగిన లెక్కింపు ప్రక్రియ తీవ్ర ఉత్కంఠగా సాగింది. రౌండ్ రౌండ్కూ బిజెపి టీఆర్ఎస్ మధ్య విజయం దోబూచులాడింది.
మొదటి ఐదు రౌండ్లతో పాటు 8, 9, 11, 20, 22, 23 రౌండ్లలో బిజెపి ఆధిక్యం ప్రదర్శించగా 6, 7, 10, 13, 14, 15, 16, 17, 18, 19 రౌండ్లలో టీఆర్ఎస్ స్వల్ప ఆధిక్యత సాధించింది కానీ అది నిలవలేదు.
ఒక్క 12వ రౌండ్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ ముందంజలో నిలిచింది. స్వల్ప ఆధిక్యతల వల్ల ఏ పార్టీ విజయం సాధిస్తుందన్న దానిపై చివరి వరకు స్పష్టత రాలేదు.
23వ రౌండ్లో బిజెపి 412 ఓట్లు ఆధిక్యం సాధించడంతో అప్పటికే 1058 మెజార్టీతో ఉన్న ఆ పార్టీ అభ్యర్థి రఘునందర్రావు 1470 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు.