దుబ్బాక ఉప ఎన్నికలో ఓటమితో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ నిర్వేదంలోకి వెళ్లిపోయారు. టీఆర్ఎస్ ఓటమిపాలైన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు.
ఉపఎన్నికలో తాము ఆశించిన ఫలితం రాలేదని చెప్పిన కేటీఆర్ ఇది పార్టీ నేతలందరికీ ఒక హెచ్చరిక వంటిదని అన్నారు. నాయకులందరూ మరింత బాధ్యతతో వ్యవహరించాల్సిన అవసరం ఉందని చెప్పారు.
దుబ్బాక ఎన్నికను పూర్తిగా పర్యవేక్షించిన రాష్ట్ర ఆర్ధిక మంత్రి హరీష్ రావును ఉద్దేశించి ఈ మాటలు మాట్లాడినట్లుగా ఉంది.
అయితే విజయాలతో పొంగిపోవడం, ఓటమితో కుంగిపోవడం టీఆర్ఎస్ కు అలవాటు లేదని తెలిపారు. రాజకీయాల్లో గెలుపు, ఓటమిలు సహజమని చెప్పారు.
టీఆర్ఎస్ కు ఓటు వేసిన 61,320 మంది ఓటర్లకు ధన్యవాదాలు తెలుపుతున్నానని కేటీఆర్ అన్నారు. టీఆర్ఎస్ ఓడిపోవడానికి కారణం ఏమిటనే దానిపై అందరం కలిసి సమీక్షించుకుంటామని చెప్పారు.
తమ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ సూచనల మేరకు భవిష్యత్ కార్యాచరణను రూపొందించుకుని ముందుకు సాగుతామని తెలిపారు.