కర్నూలు జిల్లా శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఈనెల 22వ తేదీ నుండి మార్చి 4వ తేదీ వరకు పదకొండు రోజులపాటు జరగనున్నాయి. రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ డాక్టర్ ఎం హరిజవహర్ లాల్ శ్రీశైల దేవస్థానం ఈవో లవన్న, ఉభయ దేవాలయాల ప్రధాన అర్చకులు అన్ని విభాగాల అధికారులతో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సోమవారం శ్రీశైలంలో సమావేశం నిర్వహించారు.
మహాశివరాత్రికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా జిల్లా యంత్రాంగం సహకారంతో అధికారులు ఉత్సవాలు నిర్వహించాలని అన్నారు. ముఖ్యంగా ఈ సంవత్సరం కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఉత్సవాలు నిర్వహించవలసి ఉంటుందని అన్నారు.
ఈ విషయంపై భక్తులు మాస్కులు ధరించడం భౌతిక దూరాన్ని పాటించడం తరచూ చేతులను శానిటైజేషన్ చేసుకోవడం లాంటి అంశాలపై భక్తులకు మరింత అవగాహన కల్పించాలని ఇందుకోసం అవసరమైన క్షేత్ర పరిధిలో విరివిరిగా ఫ్లెక్సీ బోర్డులు, ఏర్పాటు చేయాలన్నారు. అలాగే కరపత్రాలను అందుబాటులో ఉంచడం దేవస్థాన ప్రసార వ్యవస్థ ద్వారా తరచూ తెలియజేయడం లాంటి చర్యలు చేపట్టాలన్నారు. క్యూ కాంప్లెక్స్, క్యూలైన్లలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని క్యూ లైన్ లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.