వనపర్తి జిల్లాలో అంతరాష్ట్ర రహదారిపై ఉన్న ఊకచెట్టు వాగుపై బ్రిడ్జి లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాచాల యుగంధర్ గౌడ్ తెలిపారు. మంగళవారం వనపర్తి జిల్లా మదనాపూర్ రైల్వే గేటు సమీపంలో ఊక చెట్టు వాగుపై వంతెన నిర్మాణం పనులను ఆయన పరిశీలించారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ వర్షాకాలం ప్రారంభమైందని సరళ సాగర్ సైఫన్లు తెరుచుకున్నప్పుడు శంకర సముద్రం రిజర్వాయర్ గేట్లు ఎత్తినప్పుడల్లా ఊక చెట్టు వాగు ప్రవాహం ఎక్కువవుతుందని,దీంతో వనపర్తి నుండి ఆత్మకూరు మీదుగా రాయచూరు వెళ్లే అంతరాష్ట్ర రహదారిపై రాకపోకలు నిలిచిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఊక చెట్టు వాగుపై వంతెన నిర్మాణానికై 25 జనవరి 2017న 9.25 కోట్లతో అప్పటి రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి శంకుస్థాపన చేశారని, శంకుస్థాపన చేసి దాదాపు నాలుగున్నర సంవత్సరాలు గడుస్తున్నా నేటికి బ్రిడ్జి నిర్మాణం పనులు ప్రారంభించలేదని అన్నారు.
పోయిన యేడాది వాగు ఉధృతి ఎక్కువై 60 పనిదినాలు రాకపోకలు నిలిచిపోవడంతో ప్రజా రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడిందని, ఇద్దరు వ్యక్తులు చనిపోయిన పరిస్థితి కూడా చూశామని, వర్షాకాలంలో అత్యవసర సమయాల్లో గర్భిణీలు,ప్రజలు హాస్పిటల్స్ కు వెళ్లలేని దుస్థితి ఏర్పడుతుందదన్నారు.
వంతెన నిర్మాణం పూర్తి చేయాలని, లేదంటే బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పోస్టు కార్డు ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం మదనాపూర్ మండల కన్వీనర్ మహీందర్ నాయుడు,కొత్తకోట మండల అధ్యక్షుడు అంజన్న యాదవ్, కావలి అశోక్ కుమార్,హరికృష్ణ పాల్గొన్నారు.
పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి